ఇంగ్లిష్‌ మీడియం ఓ డ్రామా

ABN , First Publish Date - 2022-01-19T08:43:17+05:30 IST

రాష్ట్రంలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం ఓ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

ఇంగ్లిష్‌ మీడియం ఓ డ్రామా

  • కార్పొరేట్‌ స్కూళ్ల నుంచి వసూళ్ల కోసమే ప్రతిపాదన
  • ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలే లేవు
  • టీచర్ల సమస్యలు పట్టని కేసీఆర్‌ ఓ బండరాయి,
  • మానవ మృగం.. జీవో 317 సవరించేదాకా పోరు
  • త్వరలో ఉద్యోగులతో వర్చువల్‌ సభ: బండి సంజయ్‌ 


హైదరాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి):  రాష్ట్రంలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడతామంటూ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం ఓ డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో  జీతాలు ఇచ్చే పరిస్థితే లేదని దుయ్యబట్టారు. కార్పొరేట్‌ స్కూళ్ల నుంచి డబ్బులువసూలుచేయడం కోసమే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. మంగళవారం ఆయన వర్చువల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 సవరించేదాకా తమ పోరాటం కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. వారికి భరోసా కల్పించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలో వేలాది మందితో వర్చువల్‌ బహిరంగసభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జీవో 317ను సవరించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు పండుగ రోజు ప్రగతిభవన్‌ వద్ద ఆందోళన చేస్తే, సీఎం కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో ఫిడేలు వాయించారని విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఇబ్బందులు పట్టించుకోని కేసీఆర్‌ ఓ బండరాయి.. మానవమృగం అని విమర్శించారు. ఉద్యోగ ఖాళీలు గుర్తించేందుకు మరో కమిటీ వేశారంటే అది కాలయాపన కోసమే అని ఆరోపించారు. ఇదే అంశంపై ఇంతకుముందు బిశ్వాల్‌ కమిటీ, సీఎస్‌ కమిటీ నివేదికలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సోమవారం నాటి కేబినెట్‌ భేటీ ఓ టైంపాస్‌ మీటింగ్‌ అని ఎద్దేవా చేశారు. 9 గంటల పాటు సాగిన ఆ సమావేశంలో జీవో 317 కారణంగా ఉద్యోగులు, టీచర్ల ఇబ్బందులపై ఎందుకు చర్చించలేదని సీఎంను నిలదీశారు. కరీంనగర్‌లో జాగరణ దీక్ష సందర్భంగా తమ పార్టీ నాయకులను అరెస్టులు చేసి జైళ్లకు పంపారని, ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోందని ఆందోళన వ్యకతం చేశారు. ఈ తరహా నిర్బంధం నిజాం కాలంలో కూడా జరగలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 4వేల కోట్లు ఇస్తామని 2021లో ప్రకటించారని, రూ. 2వేల కోట్లు ఇచ్చినట్లు మరోసారి చెప్పారని.. నిధులు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. కేబినెట్‌ భేటీలో ప్రకటించిన నిధులతో కలిపి రూ. 13,350కోట్లు ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్న కేసీఆర్‌ కోతలు ప్రజలకు తెలిసిపోయాయన్నారు. ఆయన జాతకం బాగోలేదని, డౌన్‌ఫాల్‌ ప్రారంభమైందని చెప్పారు. వర్షాలతో ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే వరంగల్‌కు సీఎం ఎందుకు వెళ్లలేదు? అసలు ఆరోజు సీఎం చేసిన ఘనకార్యమేంటి? అని నిలదీశారు.  

Updated Date - 2022-01-19T08:43:17+05:30 IST