పర్యావరణాన్ని కాపాడాలి: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర
ABN , First Publish Date - 2021-01-24T04:45:13+05:30 IST
అడవుల అభివృద్ధి కోసం, జాతి మనుగడ, పర్యావరణ సమతుల్యత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.
సత్తుపల్లి, జనవరి 23: అడవుల అభివృద్ధి కోసం, జాతి మనుగడ, పర్యావరణ సమతుల్యత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సత్తుపల్లి రేంజీ పరిధిలోని రేజర్ల, కొమ్మేపల్లి-1,2, కిష్టారం, జగన్నాథపురం వనసంరక్షణ సమితులకు 50శాతం మంజూరైన రూ.24,00,511చెక్కులను ఆయన లబ్ధిదారులకు అటవీశాఖ కార్యాలయం ఎదుట అందజేశారు. గతంలో వీఎ్సఎ్సలు పెద్ద ఎత్తున పనిచేసేవని, కాలక్రమంలో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత మనందరిపై ఉందన్నారు. హరితహారం, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఫారెస్ట్ అర్బన్ పార్క్తో పాటు జేవీఆర్ కళాశాల, జ్యోతి నిలయం వద్ద మొక్కల పెంపకంతో మొక్కల సంరక్షణ చేపట్టామన్నారు. నియోజకవర్గంలో సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లో 1/70చట్టం అమలులో ఉందని, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిసినప్పుడు పోడు విషయమై చర్చించగా పూర్తి ఆదేశాలు వచ్చేవరకు అటవీ అధికారులు వెసులుబాటు కల్పించాల్సి ఉందన్నారు. ఇప్పటికే పంటలు వేసిన రైతులను అధికారులు ఇబ్బందులు పెట్టవద్దని కోరారు. సత్తుపల్లి బస్టాండ్ వైపు మొదలుకుని కల్లూరు మండలం వరకు డీరిజర్వు చేయించగా ఇటువైపు కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ పథకాలకు కేటాయించాల్సి ఉందని సీఎం కేసీఆర్కు తెలిపామన్నారు. అనంతరం త్వరలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించుకోనున్న నూతన మునిసిపల్ భవనాన్ని ఎమ్మెల్యే సండ్ర పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి ప్రవీణ, సబ్ డివిజన్ అధికారి సతీష్, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, కమీషనర్ కే.సుజాతలతో పాటు మునిసిపల్ కౌన్సిలర్లు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.