నాలుగు బాలల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-09T05:53:19+05:30 IST
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు.
చిత్తూరు, మే 8: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. బాలికల కోసం తిరుచానూరులోని నవ జీవన్ అంధుల గృహం, ఏర్పేడులో సేవ్ అవర్ సోల్, బాలుర కోసం తిరుపతిలోని మాతృశ్య చిల్డ్రన్ హోమ్, చిత్తూరులోని మేరీ చిల్డ్రన్ హోమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్ బాధపడుతూ ఆస్పత్రులు, క్వారంటైన్లలో ఉంటున్న తల్లిదండ్రుల పిల్లలకు ఈ సంరక్షణ కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. 18ఏళ్ల లోపు బాల బాలికల సంరక్షణ కోసం చైల్డ్లైన్ టోల్ ఫ్రీ నెంబరు 1098, మహిళా హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబరు 181కు సమాచారం అందించవచ్చని ఇన్చార్జి పీడీ నాగశైలజ తెలిపారు. అలాగే అక్షయ తృతీయను పురష్కరించుకుని జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.