ఇష్టానుసారం అభివృద్ధి పనులు
ABN , First Publish Date - 2022-01-26T02:50:48+05:30 IST
మండలంలో ఇష్టానుసారం అభివృద్ధి పనులు చేస్తుండడంతో పల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడో ఉన్న
ఆందోళనలో గ్రామీణులు
రాపూరు, జనవరి 25: మండలంలో ఇష్టానుసారం అభివృద్ధి పనులు చేస్తుండడంతో పల్లె ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడో ఉన్న ప్రజల దాహార్తి తీర్చేందుకు చేస్తున్న పనులు ఇక్కడి ప్రజలను మాత్రం ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కండలేరు జలాశయంలో నీరున్నా, ఆ నీరు చెన్నై వాసుల దాహార్తి తీర్చుతోంది.తమ ప్రాంతంలో డ్యాం ఉన్నా తమకు నీరందడం లేదని పలువురు అంటు న్నారు. రెండు జిల్లాలోని సెజ్ల దాహార్తి తీర్చే పథకం తమకు తలనొప్పులు మిగుల్చుతుందంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఇటీవల ఈ పనులపై బహిరంగంగా వ్యాఖ్యలు చేసినా, పరిశ్రమల శాఖమంత్రికి విన్నవించుకున్నా ఫలితం లేదు. దీంతో ఈ పనులు చేస్తున్నవారికి అడ్డూ అదుపూ లేకుండా పోయినట్లైంది.
మద్దెలమడుగు సెంటర్లో..
స్థానిక మద్దెలమడుగు సెంటర్ నుంచి బండేపల్లి వరకు ఎన్హెచ్ 565 చెంత పైప్లైన్ పనులను ఇటీవల ప్రారం భించారు. తొలిరోజు పనులు చేస్తూ రాత్రివేళ విద్యుత్తు స్తంభాలను తొలగించారు. పండుగవేళ రాత్రిపూట ఆ ప్రాం తాల్లోని ప్రజలు విద్యుత్తు సరఫరా లేక అల్లాడిపోయారు. ఈ పనులు రోడ్డుపై చేపడుతుండడంతో నిత్యం ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుంది. గుంతలు తీసేందుకు బండ రాళ్లు ఉండడంతో బ్లాస్టింగ్ చేసేందుకు భారీగా బ్లాస్టింగ్ మెటీరియల్స్ తీసుకువచ్చినట్లు తెలుస్తున్నది. అధికారులు దాడులు చేసి బ్లాస్టింగ్ మెటీరియల్స్ స్వాధీనం చేసుకున్నా, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ మెటీరియర్స్ వదలివేసి నట్లు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు.
ఇష్టానుసారం పనులు
నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని ఏడు సెజ్ల దాహార్తి తీర్చేందుకు ఏపీఐఐసీ ద్వారా ఈ మెగా మంచినీటి పథకాన్ని చేపడుతున్నారు.ఈ పనులు ఇష్టారాజ్యంగా చేస్తుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
ఇసుక లేకుండానే..
పైప్లైన్ పనుల్లో ఇసుక వినియోగం తప్పనిసరి. అయితే ఇసుకను వినియోగించడం లేదు. గుంతతీసి అందులో ఎక్స్కవేటర్ సాయంతో పైప్లను చేర్చి పూడ్చివేస్తున్నారు.