బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో.. : ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-05-18T15:52:11+05:30 IST

బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో.. : ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

కరీంనగర్ : ఈటల రాజేందర్‌పై భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన మరుక్షణం నుంచే ఆయన్ను టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యశాఖ మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేసిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ఎమ్మెల్సీ తీవ్ర స్థాయిలో ఈటలపై మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. ఇలా విమర్శించిన వారిలో మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒకరు. ఆయన మీడియా ముందుకొస్తే చాలు.. ఇక మాటల యుద్ధమే. ఇలా ఒకసారి రెండు సార్లు కాదు.. ఎన్ని సార్లో.!. అయితే గత కొన్ని రోజులుగా తనపై వరుస విమర్శలు గుప్పిస్తున్న గంగులపై కౌంటర్‌గా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ఈటల మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బిడ్డా.. గంగుల గుర్తుపెట్టుకో అంటూ ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


బిడ్డా గుర్తు పెట్టుకో..!

అధికారం ఎవడికీ శాశ్వతం కాదు.. బిడ్డా గంగుల గుర్తు పెట్టుకో. కరీంనగర్ సంపద విధ్వంసం చేశావ్. కరీంనగర్‌ను బొందల గడ్డగా మర్చినావ్. నీ పదవీ పైరవీ వల్ల వచ్చింది. నీ కల్చర్ నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఒక్క రోజైనా ఇక్కడి ప్రజల బాధను పంచుకున్న వారా?. ఇక్కడ ఎవరి గెలుపులో అయినా సరే మీరు సాయం చేశారా?. నాపై తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో.. ఎవడూ వెయ్యేళ్ళు బ్రతకరు.. అధికారం అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నావ్అని గంగులపై ఘాటు వ్యాఖ్యలు గుప్పిస్తూ ఈటల వార్నింగ్ ఇచ్చారు.


2023 తర్వాత నువ్వుండవ్..!

చేసిన కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావని ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. నువ్వు (గంగుల) ఎన్ని టాక్స్‌లు ఎగ్గొట్టినవో తెలవదు అనుకుంటున్నావా?. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయి. నీ కథ ఎందో అంతా తెలుసు. 2023 తరువాత నువ్వు ఉండవు.. నీ అధికారం ఉండదు. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అదే నీకు పునరావృతం అవుతుంది. అదే గతి నీకు పడుతుంది. 2006లో కరీంనగర్‌లో ఎంపీగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా.. ఎంత మందిని కొన్నా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని గెలిపించారు. ఇప్పుడు హుజురాబాద్‌లో కూడా అదే జరుగుతుంది. ప్రజలు అమాయకులు కారు. సంస్కారంతో మర్యాద పాటిస్తున్నా. సహనం కోల్పోతే మాడి మసి అయిపోతారుఅంటూ ఈటల తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.


ఈగ వాలకుండా చూస్తా..

హుజురాబాద్‌లో మా మిత్రుడికి ఇంఛార్జి ఇచ్చినట్టు తెలిసింది. కానీ మొన్న ఎంపీ ఎన్నికల్లోనూ మిగతా అన్ని నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వేస్తే..54 వేల మెజారిటీ ఇచ్చి ఆదుకున్న నియోజక వర్గం హుజురాబాద్. హుజురాబాద్ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరు కొనలేరు. ఈ ప్రజల మీద ఈగ వాలకుండా చూస్తాను అని మీడియా వేదికగా ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. అయితే ఈటల వ్యాఖ్యలపై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Updated Date - 2021-05-18T15:52:11+05:30 IST