Etela Secret Operatoin: ఆ నలుగురు ఎమ్మెల్యేలే టార్గెట్..!

ABN , First Publish Date - 2022-09-30T00:07:46+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad Bypoll) తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చకు..

Etela Secret Operatoin: ఆ నలుగురు ఎమ్మెల్యేలే టార్గెట్..!

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నిక (Huzurabad Bypoll) తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఆ ఎన్నికల్లో ఈటల రాజేందర్ (Etela Rejender) MLAగా గెలుపొందారు. అయితే ఉప ఎన్నిక సమయంలో ఎదురైన పరాభవాలు, ఆరోపణలు, విమర్శలు ఈటల మనసును తీవ్రంగా కలివేశాయట.  అప్పుడు ప్రచారానికి వెళ్లిన అధికార పార్టీ MLAలపై ఆరా తీయడం మొదలు పెట్టారట. తనపై చేసిన విమర్శలకు వారిపై రివేంజ్ తీసుకునేందుకు సిద్ధమయ్యారట. 


హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో ‘కచ్చితంగా మీ భరతం పడతా?... మీ నియోజకవర్గాల్లోకి వస్తా?... మీకు ప్రశాంతత లేకుండా చేస్తా?’ అని ఈటల బహిరంగంగానే హెచ్చరించారు. ఇప్పుడు అదే పనిగా తన కార్యాచరణ మొదలు పెట్టారట. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాలను టార్గెట్ చేసి ఆపరేషన్ లోటస్ అమలు చేస్తున్నారట.


అయితే ఆ నలుగురు MLAలు ఒకప్పుడు ఈటల రాజేందర్‌కు అత్యంత సన్నిహితులే. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో TRS అభ్యర్థికి మద్దతుగా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. మొదటి దఫా ఆ MLAల నియోజకవర్గాల్లో అసమ్మతి నేతల లిస్ట్‌ను ఈటల సేకరించారట. అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులతో ఆయనే నేరుగా మాట్లాడి వారిని బీజేపీ (Bjp)లోకి ఆహ్వానిస్తున్నారట. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు చురుకైన కార్యకర్తలు కూడా కారు దిగి కమలం జెండా అందుకుంటున్నారట. ఈటల డైరెక్షన్‌లోనే నర్సంపేట నియోజకవర్గం పరిధిలోని నెక్కొండ మాజీ ఎంపీపీ గటిక అజయ్ కుమార్ అండ్ టీమ్ కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. ఆయన కంటే ముందు యువ నేత రాణాప్రతాప్ రెడ్డి కూడా ఈటల రాజేందర్ డైరెక్షన్‌లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 


ఇక వరంగల్ (Warangal) తూర్పు నియోజకవర్గంలో కూడా ఈటల స్ట్రాటజీ అమలు చేస్తున్నారట. ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరిక వెనుక కూడా ఈటల ఆపరేషన్ సక్సెస్ అని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈటల రాజేందర్, ఎర్రబెల్లి ప్రదీప్ రావ్ (Errabelli Pradeeprao) ఇద్దరూ పౌల్ట్రీ రంగంలో దిగ్గజాలు. ఇద్దరి మధ్య మంచి వ్యాపార సంబంధాలున్నాయి. అదే సమయంలో వరంగల్ తూర్పులో రగులుతున్న విబేధాల నేపథ్యంలో ఆపరేషన్ లోటస్ అమలు చేసిన ఈటల... ఎర్రబెల్లి ప్రదీప్ రావ్‌ను కాషాయ గూటికి చేర్చారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లోనే పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని సమాచారం.


అటు వర్ధన్నపేట (Vardhannapet), పరకాలలోనూ ఈటల సేమ్ స్కెచ్ అమలు చేస్తున్నారట. వర్ధన్నపేట MLAపై కోపంతో రగులుతున్న నాయకుల జాబితా సేకరించిన ఈటల రాజేందర్ నేరుగా వారితో టచ్‌లోకి వెళ్తున్నారట. వారికి కాషాయ కండువా కప్పి కమలం గూటికి చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని అధికార పార్టీ కార్పొరేటర్ ఈ మధ్యే ఈటల రాజేందర్‌ను రహస్యంగా కలిశారని సమాచారం.


పరకాల (Parakala)లోనూ ఈటల ఆపరేషన్ అమలు చేస్తున్నారట. ఈ నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వెళ్లిపోతున్నారట. ఆయనే స్వయంగా వారిని పలకరించి ఆపరేషన్ లోటస్ అమలు చేస్తున్నారట. హుజురాబాద్ ఉప ఎన్నికల నాటి ప్రతీకారంతో రగిలిపోతున్న ఈటల... ఇప్పుడు తన మాస్టర్ మైండ్ అమలు చేస్తూ ఆ నలుగురు MLAలకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారట.


వరంగల్‌లో తన స్కెచ్ అమలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పాచిక పారుతుందనేదే ఈటల ప్లాన్ అట. అందుకే మొదట వరంగల్ జిల్లా నేతలనే టార్గెట్ చేశారట. ఈటల రివేంజ్ స్ట్రాటజీ ఆ MLAలకు స్మెల్ రావడంతో వారు కూడా అలర్ట్ అయ్యారని సమాచారం. క్యాడర్‌ను కాపాడుకునే కార్యక్రమాలు మరింత విస్తృతంగా మొదలు పెట్టారట. మరి ఏం జరుగుతుందో చూడాలి. 




Updated Date - 2022-09-30T00:07:46+05:30 IST