50 పడకల వైద్యశాల నిర్మాణం ఎన్నడో?
ABN , First Publish Date - 2021-11-29T05:50:33+05:30 IST
పట్టణంలో నిర్మిస్తున్న 50 పడకల వైద్యశాల నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది.
- ఇబ్బందుల్లో రోగులు, వైద్యులు
- పట్టించుకోని పాలకులు
ఆళ్లగడ్డ, నవంబరు 28: పట్టణంలో నిర్మిస్తున్న 50 పడకల వైద్యశాల నిర్మాణం అర్థాంతరంగా ఆగిపోయింది. దీంతో రోగులు, వైద్యులు వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం పట్టణంలోని 30 పడకల వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా మార్చాలని ప్రతిపాదించగా 50 పడకల వైద్యశాలగా మార్చింది. ఆ వెంటనే నాబార్డు కింద రూ.5.50 కోట్లు మంజూరు చేసింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వైద్యశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 30 పడకల వైద్యశాలకు పక్కనే ఉన్న సబ్ రిజిస్ర్టారు కార్యాలయాన్ని తొలగించి పిల్లర్ల వరకు పనులు సాగాయి. వీటికి ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారు గత ఐదారు నెలల నుంచి పనులు నిలిపి వేశారు. నిత్యం 200 మంది ఓపీ ఉన్న వైద్యశాలలో రోగులకు, కాన్పుల కోసం వచ్చే మహిళలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాలలో ఎక్స్రే యూనిట్ టెక్నీషియన్ లేక మూలకు చేరింది. అలాగే ఆరుగురు వైద్యులు, వైద్య సిబ్బందికి సౌకర్యాలు లేక వైద్య చికిత్సలు చేసేందుకు గదుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగులు, వైద్యులు ఇబ్బందులు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు.