ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-09-18T05:58:20+05:30 IST

ప్రతీఒక్కరు వ్యాక్సిన్‌ను తప్పని సరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ప్రజలకు సూచించారు.

ప్రతీ ఒక్కరూ టీకా వేయించుకోవాలి : కలెక్టర్‌
పొన్నారిలో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌

తాంసి,సెప్టెంబరు17: ప్రతీఒక్కరు వ్యాక్సిన్‌ను తప్పని సరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ప్రజలకు సూచించారు. శుక్రవారం మండలంలోని పొన్నారి గ్రామంలో వ్యాక్సినేషన్‌ కేంద్రంతో పాటు గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కరోనాటీకా గురించి ఆరాతీశారు. అనంతరం పలు విషయాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అనుసంధానం అయ్యాయో క్షుణంగా పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా నుంచి బయట పడాలంటే తప్పని సరిగా టీకా వేయించుకోవాలన్నారు. కొందరికి టీకా వేయించుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని అపోహలు ఉన్నాయని వాటిని విడనాడి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. అధికారులు విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో హరితహారం పల్లెప్రగతి పనులు ఏ మేరకు జరిగాయో వాటిని ఎలా ఉపయోగించుకున్నారో అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పరిసరాల పరి శుభ్రతను పాటించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములై అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాల విద్యార్థుల వద్దకు వెళ్లి చదువు ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు సకాలంలో వస్తున్నారో లేదో అనే విషయం పై విద్యార్థులను ఆరా తీశారు. ఇందులో ఎంపీటీసీ రేఖరఘు, ఎంపీడీఓ రవీందర్‌, డీఆర్డీఏ పీడీ కిషన్‌, పలువురు అధికారులు తదితరులున్నారు.


Updated Date - 2021-09-18T05:58:20+05:30 IST