Edappadi Palaniswami: సీనియర్లతో ఈపీఎస్ భేటీ
ABN , First Publish Date - 2022-08-18T13:21:51+05:30 IST
అన్నాడీఎంకే వారసత్వ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన కొద్దిసేపటికీ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి
- న్యాయనిపుణులతో మంతనాలు
చెన్నై, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే వారసత్వ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు వెలువడిన కొద్దిసేపటికీ మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) తన నివాసంలో పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. అంతేగాక న్యాయ నిపుణులతోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ వ్యవహారంపై అప్పీలుకు వెళ్లాలా? లేక సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ, అందులోని అంశాలను తమకనుగుణంగా మలచుకోవాలా అన్నదానిపై ఆయన కూలంకషంగా చర్చించారు. స్థానిక గ్రీన్వేస్ రోడ్డులోని తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలు, న్యాయవాదులతో ఆయన వంతులవారీగా భేటీ అయ్యారు.
ప్రత్యర్థి వర్గానికి తాత్కాలిక విజయం: జయకుమార్
సర్వసభ్యమండలిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రత్యర్థివర్గానికి తాత్కాలిక విజయం మాత్రమేనని మాజీ మంత్రి డి.జయకుమార్ వ్యాఖ్యానించారు. ఈపీఎ్సతో భేటీ అనంతరం జయకుమార్(Jayakumar) మీడియాతో మాట్లాడుతూ... ఈ తీర్పుపై అప్పీలుకు వెళ్ళాలా వద్దా అనే విషయంపై న్యాయనిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలో సర్వసభ్యమండలికే సర్వాధికారాలున్నాయని, ప్రస్తుతం హైకోర్టు నియమించే కమిషనర్ సమక్షంలో మళ్ళీ సర్వసభ్యమండలి సమావేశం జరుగనుందని చెప్పారు. హైకోర్టు తీర్పును విమర్శించడం భావ్యం కాదని, అదే సమయంలో ఈ వివాదాన్ని చట్టం ప్రకారం ఎదుర్కొంటామని చెప్పారు.