‘ఎస్ఐ పోస్టుల అక్రమాలను పోలీసులే వెలుగులోకి తెచ్చారు’
ABN , First Publish Date - 2022-05-05T17:01:43+05:30 IST
బెంగళూరు గోరీపాళ్యలో యువకుడి హత్య ఘటనలో తాము చెప్పినట్లు వినలేదన్న కారణంగా నగర పోలీస్ కమిషనర్ కమల్పంత్ను బీజేపీ నేతలు టార్గెట్చేసి అవమానాలకు గురిచేస్తున్నారని జేడీఎస్
- కమల్పంత్ను అవమానిస్తున్న బీజేపీ
- Ex cm kumaraswami
బెంగళూరు: బెంగళూరు గోరీపాళ్యలో యువకుడి హత్య ఘటనలో తాము చెప్పినట్లు వినలేదన్న కారణంగా నగర పోలీస్ కమిషనర్ కమల్పంత్ను బీజేపీ నేతలు టార్గెట్చేసి అవమానాలకు గురిచేస్తున్నారని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. చెన్నపట్టణలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రు అనే దళిత యువకుడి హత్యకు మతం రంగు పూయాలని భావించి భంగపడ్డ బీజేపీ కమల్పంత్ను వేధిస్తోందన్నారు. ఈ ఘటన అనంతరమే ఎస్ఐ పోస్టుల బాగోతం వెలుగు చూసిందన్నారు. పోలీసులే ఈ అక్రమాన్ని వెలుగులోకి తెచ్చారన్నారు. అత్యంత దక్షుడైన, కొవిడ్ సమయంలో పరిస్థితిని చక్కగా ఎదుర్కొని అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న కమల్పంత్ను ఈ అక్రమాల అనంతరం బలిపశువు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎస్ఐ పోస్టుల అక్రమాల ద్వారా 30 శాతం మంది అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందారని, మిగిలిన వారు న్యాయంగా పరీక్షలు రాశారని వీరెవరికీ అన్యాయం జరుగరాదన్నది తమ ఉద్దేశ్యమన్నారు. మొత్తం పరీక్షలను ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేయడం భావ్యం కాదన్నారు. పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో చాలా మంది నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారున్నారని, వీరి జీవితాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. కాగా ఈ అక్రమాల్లో మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణకు కూడా భాగం ఉందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఇందుకు సంబంధించిన ఆధారాలను మీడియాకు విడుదల చేసి ఉంటే బాగుండేదన్నారు.