‘ఒక్క చాన్స్ ఇస్తే ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి’
ABN , First Publish Date - 2022-05-11T16:59:44+05:30 IST
రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తే ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి
- జనతా జలధార ముగింపు సభావేదికపై ‘ఎన్నికల సమరశంఖం’ పూరిస్తాం
- మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి
బెంగళూరు: రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తే ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. నెలమంగలలో మంగళవారం ఆయ న మీడియాతో మాట్లాడుతూ జనతా జలధార ము గింపు సమావేశాన్ని ప్రజలకు ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశ్యంతోనే బెంగళూరు శివారులోని నెలమంగలలో విశాలమైన ప్రదేశంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 13న మ ధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కనీసం 4-5 లక్షల మంది హాజరు కావచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. తొలుత మాజీ ప్రధాని దేవేగౌడ ప్రసంగిస్తారని అనంతరం నేతలంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారన్నారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో పరిమితుల కారణంగానే ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయామని అంగీకరించారు. ఎగువ కృష్ణ, దిగువ కృష్ణ, మహదాయి, ఎత్తినహొళె, తుంగభద్ర తదితర ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసే సత్తా తమకే ఉందన్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇంత వరకు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రజలను వంచిస్తూ వచ్చాయన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని పరిరక్షించడంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యాయని విరుచుకుపడ్డారు. జనతా జలధారకు రాష్ట్ర వ్యాప్తంగా అ నూహ్య స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమరశంఖాన్ని ఇదే వేదికపై పూరిస్తామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రానున్న ఐదేళ్లలో నాలుగన్నర లక్షల కోట్లు సేకరించే సత్తా తమకు ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెన్నుపోట్లు పొడుస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే వీరికి గుణపాఠం చెబుతారన్నారు. గతంలో పార్టీకి ద్రోహం చేసినవారు రాజకీయంగా పతనమయ్యారని గుర్తు చేశారు. స్థానిక జేడీఎస్ నేతలతో కలసి ఆయన అంతకుముందు నెలమంగల సమీపంలోని 65 ఎకరాల ప్రదేశం లో జనతా జలధార ముగింపు ఏర్పాట్లను పర్యవేక్షించారు.