శిరచ్ఛేదనం పైశాచికత్వం: Ex Cm Kumaraswami

ABN , First Publish Date - 2022-06-30T16:37:10+05:30 IST

రాజస్థాన్‌లో అమాయక టైలర్‌ను శిరచ్ఛేదనం చేయడం పైశాచికత్వానికి నిదర్శనమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిరచ్ఛేదనం పైశాచికత్వం: Ex Cm Kumaraswami

బెంగళూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాజస్థాన్‌లో అమాయక టైలర్‌ను శిరచ్ఛేదనం చేయడం పైశాచికత్వానికి నిదర్శనమని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని హరించేలా కిరాతకంగా వ్యవహరించారన్నారు. హింస దేనికీ సమాధానం కాదని, అంతకు మించి పరిష్కారం కూడా కాదన్నారు. ఏ మతం కూడా హింను అంగీకరించదన్నారు. టైలర్‌ కన్హయ్యాలాల్‌ హత్యను పార్టీల కతీతంగా ఖండించాలన్నారు. కిరాతకులకు తగిన శిక్ష విధించాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వారు రాక్షసంగా ప్రవరించారన్నారు. ఇటువంటి క్రూరమైన విధానాల నుంచి అందరూ బయటకు రావాలన్నారు. హత్యచేసి మతాన్ని కాపాడాలని ఏ మతం చెబుతుందని ప్రశ్నించారు. హత్యలు, మతఘర్షణలు, ద్వేషం నుంచి మతాల మనుగడ అసాధ్యమన్నారు. మానవత్వం మరణిస్తే మతతత్వం విజృంభిస్తుందన్నారు. కన్హయ్యాలాల్‌ కిరాతక హత్య దేశవ్యాప్తంగా కన్నీరు పెట్టించిందన్నారు. హత్యచేసి గొప్పగా భావించే కిరాతక ఆలోచనల నుంచి మార్పు రావాలన్నారు.

Updated Date - 2022-06-30T16:37:10+05:30 IST