ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారు

ABN , First Publish Date - 2021-07-24T01:45:04+05:30 IST

న పైన నమోదైన కేసులపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారు

సంగారెడ్డి: తన పైన నమోదైన కేసులపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారు" అని ఆయన అన్నారు. పట్టణంలో ఆయన మాట్లాడుతూ తాను ఉద్యోగానికి వీఆర్ఎస్ చేసిన మరుసటి రోజునే కరీంనగర్‌లో తనపైన పోలీస్ కేస్ పెట్టారని, తాను వాటికి  భయపడనని ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం హుజరాబాద్‌లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.


దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు  ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్‌లు పుట్టుకు వస్తారని ఆయన అన్నారు. బహుజన రాజ్యం సృష్టించుకుందామని ఆయన పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు, అలాంటివి మళ్ళీ రానీయకండని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్ళు వరకు రాదని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళిలా ఉన్నాయని ఆయన అన్నారు. ఆ బతుకులు మార్చడానికే తాను రాజీనామా చేసి పదవిని త్యాగం చేసి వచ్చానని ఆయన తెలిపారు.


తమకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలని ఆయన డిమాండ్ చేశారు. మీ బిడ్డగా ప్రశ్నించడానికి తాను రాజీనామా చేసి వచ్చానన్నారు. ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబములో చాలా బాధ ఉంటుందన్నారు. కోట్ల మంది బాగుపడాలనే తాను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 

Updated Date - 2021-07-24T01:45:04+05:30 IST