Velumani: ప్రత్యేక న్యాయస్థానానికి వేలుమణి కేసు
ABN , First Publish Date - 2022-09-21T13:07:35+05:30 IST
తనపై మోపిన కేసులు రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) దాఖలుచేసిన పిటిషన్ను ఎంపీ,
- మద్రాసు హైకోర్టు
పెరంబూర్(చెన్నై), సెప్టెంబరు 20: తనపై మోపిన కేసులు రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి(Former minister SP Velumani) దాఖలుచేసిన పిటిషన్ను ఎంపీ, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన కేసులు విచారిస్తున్న ప్రత్యేక న్యాయస్థానానికి మద్రాసు హైకోర్టు(Madras High Court) బదిలీ చేసింది. గత అన్నాడీఎంకే హయాంలో చెన్నై, కోవై కార్పొరేషన్లలో చేపట్టిన పనులకు సంబంధించిన టెండర్లు తన మద్దతుదారులకు అప్పగించినట్లు ఎస్పీ వేలుమణిపై అవినీతి నిరోధక శాఖకు అర్పోర్ ఇయక్కం, డీఎంకే ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ 2018లో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత, చెన్నై, కోవైలో మంత్రికి వ్యతిరేకంగా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు రద్దు చేయాలని కోరుతూ వేలుమణి మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును మంగళవారం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దురైస్వామి, న్యాయమూర్తి జస్టిస్ సుందర్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం తరఫున న్యాయవాది, కేసు విచారణకు సిద్ధమని చెప్పగా, ఎస్పీ వేలుమణి తరఫున హాజరైన న్యాయవాది, ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాది ఈ కేసు విచారణకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో విచారణ వాయిదా వేయాలని కోరారు. తాము అందజేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైందని అరప్పోర్ ఇయక్కం తరఫున హాజరైన న్యాయవాది వివరించారు. అందరి విజ్ఞప్తులు పరిశీలించిన ధర్మాసనం, ఈ కేసు విచారణ ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానికి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయంలో వేలుమణి తరఫు న్యాయవాది, ప్రథమ ధర్మాసనం, రెండవ ధర్మాసనం విచారించొచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. దీంతో, కేసు విచారణ ప్రత్యేక న్యాయస్థానంలోని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.