ముఖ్యమంత్రిని కలసిన మాజీ మంత్రి
ABN , First Publish Date - 2022-04-17T17:41:49+05:30 IST
రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ముద్రపడిన మాజీ మంత్రి రమేశ్జార్కిహొళి, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైను భేటీ అయ్యారు. వారి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమయింది. విజయనగరలో
బెంగళూరు: రాష్ట్ర రాజకీయాల్లో కీలకనేతగా ముద్రపడిన మాజీ మంత్రి రమేశ్జార్కిహొళి, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో భేటీ అయ్యారు. వారి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమయింది. విజయనగరలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బొమ్మై వెళ్లే ముందు ఆర్టీ నగర్లోని నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈనెలాఖరు లేదా మే నెలలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రమేశ్ జార్కిహొళి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు రమేశ్ జార్కిహొళి కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. రాసలీలల సీడీ కేసులో మంత్రి పదవికి దూరమైన రమేశ్ జార్కిహొళి కీలక సమావేశాలకు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వంపై 40 శాతం కమీషన్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ కుట్రలకు సంబంధించిన ఆధారాలను బహిరంగం చేస్తానని ప్రకటించిన రమేశ్ జార్కిహొళి అంతలోనే సీఎంను కలవడం కీలకమైంది. ఇదే అంశంపై ఇరువురూ చర్చించి ఉంటారని తెలుస్తోంది. రమేశ్ భేటీ అయ్యాక హోంశాఖ మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ముఖ్యమంత్రిని కలిశారు.