అద్భుతం.. కాకతీయుల శిల్పసంపద
ABN , First Publish Date - 2022-07-02T06:22:42+05:30 IST
అద్భుతం.. కాకతీయుల శిల్పసంపద
బీజేపీతోనే వరంగల్ కోటలో అభివృద్ధి పనులు
కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఖిలావరంగల్, జూలై 1: కాకతీయులు నిర్మించిన శిల్పసంపద, కట్టడాలు అద్భుతమని, బీజేపీ హయాంలోనే వాటి అభివృద్ధి జరిగిందని కేంద్ర మాజీ మం త్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం వరంగల్ పర్యటనలో భాగంగా ఖిలావరంగల్ కోటను సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ 700ఏళ్ల నాడే కాకతీయలు శిల్పకళాఖండాలు, కీర్తితోరణం చెక్కించడం వారి కళాభిమానానికి నిదర్శనమని కొనియాడారు.
కళాఖండాలను ధ్వంసం చేసిన దుష్టశక్తులు
కొన్ని దుష్టశక్తులు కాకతీయుల కళాఖండాలను ధ్వంసం చేస్తే వాటిని 20ఏళ్ల క్రితం మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయ్ హయాంలో కాకతీయుల కట్టడాలను పునఃప్రతిష్ఠించారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పురావస్తు కట్టడాలకు పూర్వవైభవం తీసుకువస్తున్నామన్నారు. పురాతన కట్టడాలను ప్రతిఒక్కరూ పరిరక్షించి ముందుతరాలకు అందించాలన్నారు. ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పుల క్రాంతి డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా ఖుష్మహల్ నుంచి శిల్పాల వరకు మాజీ మంత్రిని తీసుకెళ్లారు. కాకతీయుల కట్టడాలను చేయితో తాకి అమితానందాన్ని పొందారు. కీర్తితోరణాల మధ్యన ఆయన ఒంటరిగా ఫొటోలకు ఫోజిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ వరంగల్ తూర్పు ఇంచార్జి కుసుమ సతీష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కొప్పుల క్రాంతి, జిల్లా నాయకులు అచ్చ విద్యాసగర్, గంట రవికుమార్, బాకం హరిశంకర్, రంజిత్కుమార్, బైరి శ్యామ్సుందర్, పుప్పాల రాజేందర్ పాల్గొన్నారు.
ప్రధాని పాల్గొనే బహిరంగసభను విజయవంతం చేయాలి
వరంగల్టౌన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రవిశంకర్ప్రసాద్ పిలుపునిచ్చారు. శుకవ్రారం కాశిబుగ్గ కేవీఎస్ ఫంక్షన్ హాలులో బీజేపీ వరంగల్ తూర్పు నియోజకవర్గం బూత్స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రవిశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని జాతీయపార్టీ ఆకాంక్షిస్తోందని, అందుకోసమే హైదరాబాద్లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. 3న హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు నియోజికవర్గం నాయకులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, బాకం హరిశంకర్, అచ్చ విద్యాసాగర్, గంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.