జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-08-11T03:22:08+05:30 IST

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎద్దేవా చేశారు.

జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 10: ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు ఎద్దేవా చేశారు. బుధవారం స్థానిక చెంచలబాబు అతిథిగృహంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్‌తో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తేదీ పూర్తయినా ఇంకా 60 శాతం మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నారన్నారు. కావలి-దుత్తలూరు జాతీయ రహదారి నిర్మాణం ఘనత తనదేనన్నారు. ఎంపీ మాధవ్‌ చర్యల వల్ల దేశంలో రాష్ట్రం పరువు పోయిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదని, నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధే ప్రస్తుతం కనిపిస్తుందన్నారు.  పని చేసే నాయకుడు ఎవరో ప్రజలే గుర్తించాలన్నారు. సభ్యత్వ నమోదు లక్ష్యాలను ప్రతిఒక్కరు పూర్తి చేయాలన్నారు. దేశంలో ఏ పార్టీ లేనంత విధంగా టీడీపీ సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని, ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేయాలన్నారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బయ్యన్న, రియాజ్‌, బొజ్జా నరసింహులు, వెంకటస్వామి, నల్లిపోగు రాజా, ఓబులరెడ్డి సందానీ, మతకాల శ్రీనివాసులు, మాబాషా, ఖాన్‌సా, శివకృష్ణ, రామ్మోహన్‌, జల్సాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T03:22:08+05:30 IST