మళ్లీ డీఎంకేలోకి మాజీ ఎమ్మెల్యే సెల్వం
ABN , First Publish Date - 2022-02-13T14:28:07+05:30 IST
స్థానిక థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం మళ్లీ డీఎంకే పంచన చేరారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ తేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
చెన్నై: స్థానిక థౌజండ్ లైట్స్ మాజీ ఎమ్మెల్యే సెల్వం మళ్లీ డీఎంకే పంచన చేరారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. 2020 ఆగస్టు 4వ తేదీన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దీంతో ఆగ్రహించిన డీఎంకే అధిష్ఠానం సెల్వంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేగాక నియోజకవర్గంలోనూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ సమయంలో ఆయన డీఎంకే అసమ్మతి నేతగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గత ఏడాది మార్చిలో స్థానిక టి.నగర్లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన సెల్వం.. ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ.. మళ్లీ ఆయన డీఎంకే గూటికి చేరారు. శనివారం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.