పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహించండి
ABN , First Publish Date - 2021-07-24T05:21:33+05:30 IST
విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 4వ తేదీ నుంచి జరిగే డిగ్రీ మొదటి ఏడాది పరీక్షలను నెల రోజులపాటు వాయిదా వేసి, ఆ తర్వాత రోజు మార్చి రోజు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.
వీఎస్యూ అధికారులకు ఎస్ఎఫ్ఐ నేతల వినతి
వెంకటాచలం, జూలై 23 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో వచ్చే నెల 4వ తేదీ నుంచి జరిగే డిగ్రీ మొదటి ఏడాది పరీక్షలను నెల రోజులపాటు వాయిదా వేసి, ఆ తర్వాత రోజు మార్చి రోజు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని కాకుటూరు వద్ద ఉన్న వీఎస్యూలో శుక్రవారం వర్సిటీ రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, రెక్టార్ ఎం.చంద్రయ్యలను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పీ. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులంతా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువ మంది ఉన్నారని, తొలుత వసతిగృహాలు ప్రారంభించిన తర్వాత పరీక్షలను రోజు మార్చి రోజు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి ఏడాది డిగ్రీ విద్యార్థులు 22,700 మందికి పైగా ఉన్నారని, వర్సిటీ అధికారులు విద్యార్థులందరికీ అన్లైన్ తరగతులు అందించిన తర్వాత పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పగిడిపోగు కిరణ్ కిషోర్, సిసింద్రీ, సందీప్, వెంకయ్య, భాను తదితరులున్నారు.