జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రవాసీయుల్లో ఉత్కంఠ
ABN , First Publish Date - 2020-11-30T00:45:14+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎన్నారైలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి హోరాహోరీ ప్రచారం, వివాదాస్పద ప్రకటనలు, భావోద్వేగ ప్రసంగాలు విదేశాల్లో ఉంటున్న హైదరాబాద్ వాసుల్లో ఉత్కంఠత రేపుతున్నాయి. ఎన్నికల ప్రచార తీరుతెన్నులను ప్రవాసీయులు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిగా తిలకిస్తున్నారు. బంధుమిత్రులకు ఫోన్ చేసి..
(గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎన్నారైలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి హోరాహోరీ ప్రచారం, వివాదాస్పద ప్రకటనలు, భావోద్వేగ ప్రసంగాలు విదేశాల్లో ఉంటున్న హైదరాబాద్ వాసుల్లో ఉత్కంఠత రేపుతున్నాయి. ఎన్నికల ప్రచార తీరుతెన్నులను ప్రవాసీయులు సామాజిక మాధ్యమాల్లో ఆసక్తిగా తిలకిస్తున్నారు. బంధుమిత్రులకు ఫోన్ చేసి తమ డివిజన్లలో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. హైదరాబాద్ వాసులు అమెరికా, కెనడా, బ్రిటన్తో పాటు గల్ఫ్ దేశాల్లో వేల సంఖ్యలో ఉన్నారు. పాతబస్తీకి చెందిన వారు ఎక్కువగా గల్ఫ్లో ఉన్నారు. స్థానికంగా నివసించకున్నా వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించలేదు. పైగా విదేశాల్లో ఉన్నప్పటికీ ప్రతి ఎన్నికల్లో వీరి ఓట్లు పోల్ అవుతున్నాయి. అయితే, 2002లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్గా పని చేసిన ఓ అధికారి అప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిగ్గింగ్ను భారీ స్థాయిలో తగ్గించారు.
విదేశాల్లో ఉన్న వారి పేరిట ఓట్లు వేస్తే వారి పాస్పోర్టులు రద్దు చేస్తామని పోలీసు జీపుల ద్వారా విస్తృత ప్రచారం చేయించడంతో పోలింగ్ శాతం భారీగా తగ్గింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదటి నుంచీ ప్రచారం సందర్భంగా మతపరమైన, భావోద్వేగ, ఉద్రిక్తతను రెచ్చగొడుతుంది. ఇప్పుడు బీజేపీ కూడా మజ్లి్సకు దీటుగా మతపరమై ఉద్రిక్తతను రెచ్చగొట్టడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. మొత్తానికి రాజకీయ పార్టీలు అభివృద్ధి, సమస్యలకు బదులు వివాదాస్పద, అనాలోచిత అంశాలపై రచ్చ చేయడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.