ఉత్కంఠభరితంగా హాకీ టోర్నీ
ABN , First Publish Date - 2022-01-26T06:11:45+05:30 IST
ఎలమంచిలి రాజీవ్గాంధీ క్రీడా మైదానంలో జరుగుతున్న 12 వ రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ టోర్నమెంటులో విశాఖ, నెల్లూరు జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ పోటీలు రసవత్తరంగా సాగాయి.
ఫైనల్స్ చేరిన విశాఖ, నెల్లూరు జట్లు
ఎలమంచిలి, జనవరి 25: ఎలమంచిలి రాజీవ్గాంధీ క్రీడా మైదానంలో జరుగుతున్న 12 వ రాష్ట్ర స్థాయి జూనియర్ హాకీ టోర్నమెంటులో విశాఖ, నెల్లూరు జట్లు ఫైనల్స్కు చేరుకున్నాయి. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ పోటీలు రసవత్తరంగా సాగాయి. 13 జిల్లాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు టోర్నీలో పాల్గొన్నారు. బుధవారం ఫైనల్స్లో విశాఖ, నెల్లూరు జట్లు తలపడతాయి. అలాగే 3, 4 స్థానాలకు కూడా పోటీలు జరుగనున్నాయి. మంగళవారం జరిగిన మొదటి సెమీఫైనల్లో అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య జరిగిన పోటీ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లు నిర్ణీత సమయంలో గోల్స్ చేయకపోవడంతో అంపైర్ షూట్ అవుట్లు ఇవ్వడంతో నెల్లూరు-3, అనంతపూర్-2 గోల్ చేయగా నెల్లూరు విజయం సాధించింది. రెండో సెమీఫైనల్లో విశాఖ, చిత్తూరుపై 4-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. క్రీడాకారులను వైహెచ్ఏ ప్రెసిడెంట్ జీవీ రెడ్డి, సీనియర్ క్రీడాకారులు దాసరి మహేశ్, రాంబాబు, రమేశ్ తదితరులు పరిచయం చేసుకున్నారు. బుధవారం ఉదయం జరుగనున్న ఫైనల్ పోటీ కోసం మరిన్ని ఏర్పాట్లు చేసినట్టు వైహెచ్ఏ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు.