టీచర్ల సర్దుబాటుకు కసరత్తు
ABN , First Publish Date - 2021-12-06T05:31:32+05:30 IST
పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ఉన్నతపాఠశాలల్లో 3,4,5 తరగతుల విద్యార్థులను విలీనం చేసిన నేపథ్యంలో వాటిలో ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా మరో 900 మంది ఉపాఽధ్యాయులు అవసరమవుతారని అంచనా వేస్తున్నారు.
మార్గదర్శకాలు విడుదల
హైస్కూళ్లకు అదనంగా 900 మంది అవసరం
ఒంగోలు విద్య, డిసెంబరు 5 : పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకానికి కసరత్తు ప్రారంభించింది. ఉన్నతపాఠశాలల్లో 3,4,5 తరగతుల విద్యార్థులను విలీనం చేసిన నేపథ్యంలో వాటిలో ప్రస్తుతం ఉన్న వారికి అదనంగా మరో 900 మంది ఉపాఽధ్యాయులు అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ఉన్నత విద్యార్హతలు ఉండి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను అవసరమున్న హైసూళ్లకు పని సర్దుబాటు కింద తరలించేందుకు డీఈవో బి.విజయభాస్కర్ మార్గదర్శకాలు జారీ చేశారు. సర్దుబాటు బాధ్యతను ఉపవిద్యాధికారులు, మండల విద్యాధికారులకు అప్పగించారు.
మార్గదర్శకాల ఇవీ..
ముందుగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమో గుర్తించారు.
హైస్కూళ్లలో 200 మంది విద్యార్థులుంటే 9 మంది స్కూలు అసిస్టెంట్లు/ఎ్సజీటీలు, ఒక హెడ్మాస్టర్, వ్యాయామ విద్య స్కూలు అసిస్టెంటు అవసరం. 3,4,5 తరగతులకు నాలుగు సబ్జెక్టులు బోధించేందుకు నలుగురు.. 6,7 తరగతులకు 6 సబ్జెక్టులు బోధించేందుకు ఆరుగురు.. 8 నుంచి 10 తరగతి వరకు 7 సబ్జెక్టులు బోధించేందుకు ఏడుగురు టీచర్లు అవసరమని తేల్చారు.
స్కూలు కాంప్లెక్సు మండలం, డివిజన్ స్థాయిలో మిగులుగా తేలిన స్కూలు అసిస్టెంట్లు/ఎ్సజీటీలను గుర్తిస్తారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో బీఈడీ విద్యార్హతలు ఉన్న ఎస్జీటీల వివరాలు కూడా సేకరిస్తారు. ప్రాథమికంగా స్కూలు కాంప్లెక్సు పరిధిలో ఉపాధ్యాయులు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అది సాధ్యం కాకపోతే మండల, డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు.
20 మంది లోపు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుంటే వారిలో ఉన్నత విద్యార్హతులు ఉన్న ఒకరిని పని సర్దుబాటు కింద అవసరమున్న పాఠశాలల్లో నియమిస్తారు.