ప్రవాసుల క్షమాభిక్ష పథకం గడువు పొడిగించిన ఒమన్
ABN , First Publish Date - 2021-06-19T18:32:48+05:30 IST
ఒమన్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక క్షమాభిక్ష పథకం గడువును అక్కడి సర్కార్ పొడిగించింది.
మస్కట్: ఒమన్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం అమలు చేస్తున్న ప్రత్యేక క్షమాభిక్ష పథకం గడువును అక్కడి సర్కార్ పొడిగించింది. ఆగస్టు 31 వరకు అమ్నెస్టీ గడువును పొడిగించినట్లు ఆ దేశ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ గడువు ముగిసేలోపు సరియైన ధృవపత్రాలు లేని ప్రవాసులు దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఆగస్టు 31లోపు దేశం విడిచి వెళ్లే ప్రవాసులు ఎలాంటి జరిమానా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే వీరిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండవని చెప్పింది. రెసిడెన్సీ గడువు ముగిసిన వారికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని ప్రవాసులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ కోరింది. రెసిడెన్సీ గడువు ముగిసిన వారు, అక్రమంగా దేశంలో ఉంటున్న ప్రవాసులు ముందుకు వచ్చి లేబర్ మినిస్ట్రీ అధికారిక వెబ్సైట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది.