నాడు భూమి పోయినా పరిహారం రాలేదునేడు ముంపులో ఉన్న ఊరు, ఇల్లు

ABN , First Publish Date - 2021-03-09T08:55:21+05:30 IST

ప్రాజెక్టు కింద పోయిన భూమికి పరిహారం రాలేదు.. ఇప్పుడు ఉన్న ఊరు, ఇల్లు కూడా ముంపులో పోనుంది.. ఇక బతికేదెట్లా అని మనోవేదనతో ఆ నిర్వాసితుడు గుండెపోటుతో మృతి చెందాడు.

నాడు భూమి పోయినా పరిహారం రాలేదునేడు ముంపులో ఉన్న ఊరు, ఇల్లు

గుండెపోటుతో నిర్వాసితుడు మృతి

తొగుట, మార్చి 8: ప్రాజెక్టు కింద పోయిన భూమికి పరిహారం రాలేదు.. ఇప్పుడు ఉన్న ఊరు, ఇల్లు కూడా ముంపులో పోనుంది.. ఇక బతికేదెట్లా అని మనోవేదనతో ఆ నిర్వాసితుడు గుండెపోటుతో మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మొగిలిచెరువు తండాలో చోటుచేసుకుందీ విషాదం. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భానోతు హనుమంతు (32)కు తండ్రి నుంచి సంక్రమించిన 2.20 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో 2012లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని కాలువ నిర్మాణం చేపట్టారు. అపుడు ప్రభుత్వ భూమి అని అధికారులు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు.


దాంతో పాటు ఇటీవల మల్లన్నసాగర్‌ నిర్మాణం కోసం ఉన్న ఊరు, ఇల్లు నీటిలో మునిగిపోతుండటంతో హనుమంతు తీవ్రంగా కుంగిపోయాడు. ఆదివారం అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించే క్రమంలో తనకు పరిహారం ఇప్పించాలని హనుమంతు వేడుకున్నాడు. పరిహారం రాదని, తమ చేతుల్లో ఏమీ లేదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో మనోవేదనకు గురైన హనుమంతుకు సోమవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. కుటుంబసభ్యులు గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు హనుమంతు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య జ్యోతి, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, ఆ భూమిని పాత అవార్డు కింద అప్రూవల్‌ కోసం ప్రభుత్వానికి పంపించామని, మల్లన్నసాగర్‌ కింద రాదని చెప్పాం తప్ప తాము అతనికి పరిహారం ఇవ్వబోమని అన్నారనడంలో వాస్తవం లేదని తొగుట తహసీల్దార్‌ బాల్‌రెడ్డి తెలిపారు.  

Updated Date - 2021-03-09T08:55:21+05:30 IST