ఈ ప్రత్యేక రైలులో లోకో పైలట్, గార్డు, టీటీఈలందరూ మహిళలే...
ABN , First Publish Date - 2022-03-09T13:21:26+05:30 IST
లోకో పైలట్, గార్డు, టీటీఈ, ఆర్పీఎఫ్ సిబ్బంది అంతా మహిళలు కలిసి ప్రత్యేక రైలు నడిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది....
జంషెడ్పూర్:లోకో పైలట్, గార్డు, టీటీఈ, ఆర్పీఎఫ్ సిబ్బంది అంతా మహిళలు కలిసి ప్రత్యేక రైలు నడిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని చక్రధర్పూర్ (సీకేపీ) డివిజన్లో లోకో పైలట్, గార్డు, టీటీఈ, భద్రతా సిబ్బంది సహా అందరూ మహిళా సిబ్బందితో కలిసి తొలిసారిగా ఎక్స్ప్రెస్ రైలును నడిపారు.13288 నంబరు సౌత్ బీహార్ ఎక్స్ప్రెస్ దానాపూర్ నుంచి దుర్గ్ మధ్య నడుస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం సికెపి నుంచి రూర్కెలా స్టేషన్ ల మధ్య మహిళా ప్రత్యేక రైలుగా మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక రైలుకు డివిజనల్ రైల్వే మేనేజర్ విజయ్ కుమార్ సాహు, రైల్వే మహిళా సంక్షేమ సంస్థ చైర్మన్ అంజులా సాహుతో కలిసి పచ్చజెండా ఊపారు.మహిళా దినోత్సవం రోజున మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యం అని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనీష్ పాఠక్ చెప్పారు.