విస్తృతంగా పారిశుధ్య పనులు : డీపీవో
ABN , First Publish Date - 2021-04-16T04:41:55+05:30 IST
కరోనా నియంత్రణలో భాగంగా జిల్లాలో అన్ని పంచాయతీల్లో విస్తృతంగా పారిశుధ్య పనులు నిర్వహించాలని డీపీవో సునీల్ రాజ్కుమార్ ఆదేశించారు.
విజయనగరం (ఆంధ్రజ్యోతి), ఏప్రిల్ 15: కరోనా నియంత్రణలో భాగంగా జిల్లాలో అన్ని పంచాయతీల్లో విస్తృతంగా పారిశుధ్య పనులు నిర్వహించాలని డీపీవో సునీల్ రాజ్కుమార్ ఆదేశించారు. గురు వారం తన చాంబర్ నుంచి ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ హరిజవహర్లాల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో చురుగ్గా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో చెత్తాచెదారం, కాలువల్లో పూడిక ను పంచాయతీ శివారు ప్రాంతాల్లో ఉున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇక రక్షిత నీటి పతకం ట్యాంకులను తక్షణమే శుభ్రం చేయించాలన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్య సిబ్బందిని సమన్వయం చేసుకుని పారిశుధ్య పనులు మరింత విస్తృతం చేయాలని తెలిపారు. కరోనా కేసుల విషయమై పంచాయతీలకు సంబంధించి తనకు నివేదిక అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. 15వ ఆర్థికసంఘం నిధుల నుంచి రూ.46 కోట్లు పంచాయతీలకు మంజూరైందని చెప్పారు. గత ఏడాదికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.103 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది సురేష్, ఎ.శ్రీనివాస్, హరి, కుమార్, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.