నేత్రపర్వంగా దివ్యవిమాన రథోత్సవం

ABN , First Publish Date - 2021-02-27T05:53:52+05:30 IST

యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టం లక్ష్మీనరసింహుల దివ్యవిమాన రథోత్సవం శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా కొనసాగింది.

నేత్రపర్వంగా దివ్యవిమాన రథోత్సవం
అశేష జనవాహిని నడుమ పాతగుట్టలో కొనసాగుతున్న దివ్యవిమాన రథోత్సవం

పాతగుట్ట లక్ష్మీనరసింహుడికి గరుడవాహన సేవ


యాదాద్రిటౌన్‌, ఫిబ్రవరి 26: యాదగిరిగుట్ట అనుబంధ ఆలయం పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టం లక్ష్మీనరసింహుల దివ్యవిమాన రథోత్సవం శుక్రవారం రాత్రి నేత్రపర్వంగా కొనసాగింది. విశ్వశాంతి, లోకకల్యాణం కోసం నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా పట్టువస్త్రాలు, బంగారు ముత్యాల ఆభరణాలతో కల్యాణమూర్తులు లక్ష్మీనరసింహుడిని దివ్య మనోహరంగా అలంకరించి రథంపై అధిష్ఠింపజేశారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ రథాన్ని లాగారు. అంతకు ముందు స్వామి వారి రథానికి అర్చకులు పూజలు చేశారు. రఽథాంగ హోమం, రథాంగబలి, దిష్టికుంభ పూజ నిర్వహించారు. అంతకుముందు మధ్యాహ్నం వెండి గరుడ వాహన సేవ నిర్వహించారు. అభిషేకం, తులసీ దళార్చన, వేద పారాయణ పఠనం నిర్వహించారు. పూజా కైంకర్యాలను దేవస్థాన ప్రధానర్చకుడు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహచార్యులు, ఉపప్రధానార్చకులు చించాపట్టణం రంగాచార్యులు, పాతగుట్ట ముఖ్య అర్చకులు కొండకండ్ల మాధవాచార్యులు, వేదపండితులు, నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో ఎన్‌.గీతారెడ్డి, ఏఈవో దోర్భల భాస్కరశర్మ, తదితరులు పాల్గొనగా, రథోత్సవంలో అవాంఛనీయ ఘటన జరగకుండా ఏసీపీ కె.నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Updated Date - 2021-02-27T05:53:52+05:30 IST