ఫీజులు అరికట్టడంలో విఫలం
ABN , First Publish Date - 2022-06-30T05:17:53+05:30 IST
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
- స్కూళ్లలో అక్రమ అడ్మిషన్లు నిలిపివేయాలి
- డీఈవో కార్యాలయం ఎదుట విద్యార్థి నాయకుల ధర్నా
కర్నూలు(ఎడ్యుకేషన్), జూన 29: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సోమన్న, శ్రీరాములుగౌడు మాట్లాడుతూ ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారన్నారు. పాఠశాలల్లో అక్రమ అడ్మిషన్లు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫీజుల నియంత్రణ మండలిని ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అనుమతుల్లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న డీఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. డీఈవో కార్యాలయం లోపలికి విద్యార్థులు చొచ్చుకుపోవడంతో అక్కడ పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకుల మద్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి స్టేషనకు తరలించారు. అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ విజేంద్ర, భాషా, రంగస్వామి, థోమస్, శరత కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.