వీడియోలు లైక్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే రోజుకు రూ. 30 వేలు.. ఇదెలా సాధ్యం?

ABN , First Publish Date - 2021-10-26T05:04:58+05:30 IST

గతంలో జరిగిన గొలుసు కట్టు వ్యాపారాలు నేరుగా జరిగేవి. ఇలాంటి వాటిల్లో మోసపోతే కనీసం సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది.

వీడియోలు లైక్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే రోజుకు రూ. 30 వేలు.. ఇదెలా సాధ్యం?

ఆన్‌లైన్‌ వేదికగా మోసాల పరంపర కొనసాగుతోంది. అమాయకత్వంతోనే.. డబ్బులు వస్తాయనే ఆశతోనే పెద్దసంఖ్యలో ఆన్‌లైన్‌ వలకు చిక్కి విలవిలలాడుతున్నారు. ఆన్‌లైన్‌ మోసగాళ్లు రూటుమార్చారు. మీకు ఒక లింక్‌ను పంపిస్తాం.. దానిని డౌన్‌లోడ్‌ చేసుకోండి.. ఆ తరువాత మీకు నచ్చిన ప్యాకేజీల్లో చేరండి.. పంపిన వీడియోలు లైక్‌ చేసి వాటిని స్ర్కీన్‌షాట్‌ తీసి మాకు పంపతే చాలు మీకు డబ్బులే డబ్బులు.. అంటూ సైబర్‌ మోసగాళ్లు  విసురుతున్న వలకు పలువురు చిక్కి విలవిలలాడుతున్నారు. తక్కువ సమయంలో అత్యంత సులువుగా రూ.లక్షలు సంపాదించుకోవచ్చు.. ఇలా ఎందరో సంపాదిస్తున్నారు.. మీరూ చేరండి మరికొందరిని చేర్చండి అని మోసగాళ్ల మాయలో పడిపోయిన వారు.. చివరకు ఇదంతా మోసమని తెలుసుకునే సరికి రూ.లక్షల్లో నష్టపోతున్నారు. ఇలా మోసపోయిన వారందరూ విద్యావంతులే. దీంతో బయటికి చెప్పుకోలేక ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు లబోదిబోమంటున్నారు.

 

గుంటూరు(తూర్పు), అక్టోబరు 25: గతంలో జరిగిన గొలుసు కట్టు వ్యాపారాలు నేరుగా జరిగేవి. ఇలాంటి వాటిల్లో మోసపోతే కనీసం సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉండేది. కానీ ఆన్‌లైన్‌ వేదికగా యాప్‌ల ద్వారా మోసాలు చేసేందుకు కొందరు సైబర్‌ నేరగాళ్లు రంగంలోకి దిగారు. కొంతమంది సైబర్‌ కేటుగాళ్లు.. మా వెనుక నడవండి.. అనుసరించండి.. అని అర్థం వచ్చేలా ఒక యాప్‌ను రూపొందించారు. ఇది లింక్‌ ద్వారానే ఫోనులో డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత వీటిలో ఉండే స్కీమ్‌లు ఓపెన్‌ అవుతాయి. వాటిలో రూ.6 వేలు నుంచి 6 లక్షల వరకు వివిధ రకాల స్కీమ్‌లు ఉంటాయి. వీటిలో మనకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న తరువాత ఫోనుకు కొన్ని యూట్యూబ్‌ వీడియోలు వస్తాయి. వాటిని లైక్‌ చేసి, షేర్‌ చేసి దానిని స్ర్కీన్‌షాట్‌ తీసి వారికి పంపాలి. మనం చేరిన స్కీమ్‌లకు అనుగుణంగా ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. అంటే ఉదాహరణకు రూ.6 వేల స్కీమ్‌లో చేరితే రోజుకు రూ.300 జమ అవుతాయి. అదే రూ.6 లక్షల స్కీమ్‌లో చేరితే రోజుకు రూ.30 వేలు జమ అవుతాయి. అంటే 20 రోజుల్లో మన పెట్టుబడి మనకు జమ అవుతుంది. ఆ తరువాత నుంచి వచ్చేది అంతా లాభాలే. రూ.6 వేలు, 12 వేలు, 90 వేలు, లక్షా 20వేలు వంటి స్కీమ్‌లు ఉన్నాయి. అలాగే ముందుగా స్కీమ్‌లో చేరిన వారు మరికొందరిని చేర్పిస్తే అదనంగా డబ్బులు కూడా వస్తాయి. పెద్ద, పెద్ద వాళ్లు స్కీమ్‌లో ఉన్నారంటూ వారి ఫొటోలు మార్ఫింగ్‌ చేయడంతో చాలామంది ఈ యాప్‌లో చేరారు. కొంతమంది అప్పులు తెచ్చి మరీ ఈ యాప్‌లో సభ్యులుగా చేరారు. ఒకటిన్నర  సంవత్సరం కిందట పెట్టిన ఈ యాప్‌లో లక్షలాది మంది చేరి కోట్లాది రూపాయిలను కట్టి మరి లింక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మొదట్లో అందరికీ డబ్బులు కూడా సరిగానే వేశారు. దీంతో ఒక్కొక్కరూ రెండు, మూడు ఖాతాలను తెరవడమేగాక తమకు తెలిసిన వాళ్లను కూడా చేర్చారు. సరిగ్గా సమయం చూసుకుని కేటుగాళ్లు దుకాణం మూసివేశారు. దీంతో డబ్బు కట్టినవాళ్లు లబోదిబోమంటున్నారు. యాప్‌లో మోసపోతే ఎవరిపై ఫిర్యాదు చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు ఈ యాప్‌ సృష్టికర్త ఎవరో వాళ్లు ఎక్కడ ఉండి దీనిని ఆపరేట్‌ చేస్తారో ఎవరికీ తెలియదు.


ఈ నెల 20 నుంచి జమ కాని నగదు 

అంతా బాగుంది అనుకునే సమయంలో ఈ నెల 20 నుంచి మోసం బయటపడింది. ఆ రోజు ఉదయం నుంచి ఖాతాలకు డబ్బులు జమకావడం నిలిచిపోయింది. దీంతో ఖాతాదారులు అందరూ కలసి క్రియేట్‌ చేసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌లో దీనిపై పెద్దఎత్తున చర్చ నడిచినట్టు సమాచారం. సాయంత్రానికి అడ్మిన్‌ లైన్‌లోకి వచ్చి మరో రూ.4 వేలు కట్టి గ్రీన్‌జోన్‌లోకి చేరితే నగదు  ఖాతాల్లోకి జమ అవుతాయని సెలవిచ్చారు. దీంతో కొంతమంది   ఆ మొత్తం కూడా కట్టారు. రూ.4 వేలు కట్టిన తరువాత యాప్‌ ఆగిపోయంది. దీంతో డబ్బులు కట్టిన వారికి మోసపోయాం అన్న విషయం అర్థమై లబోదిబోమంటున్నారు. దసరాకు ఇలాంటిదే ఒక యాప్‌ మొదలై వారం రోజుల్లో లక్షల రూపాయిలను కూడబెట్టుకుంది. ఈ యాప్‌ త్వరలో ఒక పెద్ద కంపెనీలా ఆవిర్భవించబోతుందని దీనికి సీఈవో కావాలని ఈ యాప్‌ ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఇందుకు రూ.2 లక్షలు చెల్లించాలన్న తర్వాత కూడా పలువురు  ఎగబడి నగదు కట్టినట్టు సమాచారం. గుంటూరు నగరంలో సుమారు 58 మంది ఈ సీఈవో పోస్టుకు డబ్బులు కట్టినట్టు తెలిసింది. 


రెండు రోజుల కిందట మరో యాప్‌

ఇదే తరహా స్కీమ్‌లతో డిపాజిట్లు కాస్త అటుఇటుగా మార్చి మరో యాప్‌ రంగంలోకి దిగింది. దీనిలో కూడా అందరూ ఎగబడి చేరుతున్నారు. ఇంతకు ముందు రెండు యాప్‌ల ద్వారా మోసపోయిన వారే ఈ యాప్‌లో కూడా చేరుతున్నట్టు సమాచారం. 


చట్టం ఏం చెబుతుంది 

చట్ట ప్రకారం కంపెనీలు, వ్యక్తులు అనధికారికంగా డిపాజిట్లను సేకరించకూడదు. అలా సేకరించేవారు సరాసరి 6 నుంచి 12 ఏళ్ల వరకు శిక్షార్హులు అని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. ఆన్‌లైన్‌ కేసుల్లో సూత్రదారి ఎక్కడ ఉంటాడో తెలియదు గనుకు స్కీమ్‌లో చేర్పించిన వారే ఆప్రమత్తంగా ఉండాలి. చట్ట ప్రకారం ఒకరి కంటే ఎక్కువ మందిని ఈ స్కీమ్‌లో చేర్పించిన వారు శిక్షార్హులే.  

Updated Date - 2021-10-26T05:04:58+05:30 IST