నిబంధనలు పాటిద్దాం- కరోనాను కట్టడి చేద్దాం
ABN , First Publish Date - 2021-05-09T07:33:09+05:30 IST
కరోనా నిబంధనలు అతిక్రమించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేయని పలు దుకాణ దారులకు తహసీల్దార్ డి.సీతారామయ్య ఒక్కొక్కరికి రూ. 5వేలు జరిమానా విధించారు.
కందుకూరు, మే 8: కరోనా నిబంధనలు అతిక్రమించి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మూసివేయని పలు దుకాణ దారులకు తహసీల్దార్ డి.సీతారామయ్య ఒక్కొక్కరికి రూ. 5వేలు జరిమానా విధించారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, సీఐ విజయకుమార్తో కలిసి పట్టణ ంలో పర్యటించి తెరిచి ఉన్న దుకాణాలు, స్ర్టీట్ హోటల్స్ నిర్వాహకులకు జరిమానాలు విధించారు. పన్నెండు గంటలకు ఎట్టి పరిస్థితుల్లో మూసివేయాలని, లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలు ఆటోవాలాలకు, ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
పీసీపల్లి, మే 8 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శనివారం పంచాయతీ అధికారులు పారిశుధ్య పనులు చేపట్టారు. మండల కొవిడ్ టాస్క్ఫోర్స్ అధికారి పి.సింగారావు క్షేత్ర స్థాయిలో కంటైన్మెంట్ ప్రాంతాలు, రెడ్ జోన్గా ప్రకటించిన గ్రామాలను పరిశీలించారు. తక్షణమే ఆయా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పెద్దన్నపల్లి, మురిగమ్మి, తురకపల్లి, అడవిలోపల్లి గ్రామాల్లోని వీఽధుల్లో, ఇళ్ల ముంగిట, చేతి పంపుల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. శనివారం నుంచి మరో రెండు రోజులపాటు ఆయా గ్రామాల్లో సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేయనున్నట్లు కార్యదర్శులు తెలియజేశారు.
సీఎస్పురం, మే 8 : కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మండలంలోని పెదరాజుపాలెం, చింతపూడి, చెర్లోపల్లి గ్రామాలలో పంచాయతీ అధికారులు పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లించి, సోడియం హైపోక్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేయించారు. పాజిటివ్ నిర్ధారణ అయినవారు ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనాపై కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సుందరరామయ్య, పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు.
తాళ్లూరు, మే 8: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని దర్శి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇడమకంటి వేణుగోపాల్రెడ్డి అన్నారు. తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జరుగుతున్న కొవిడ్ వాక్సిన్ ప్రక్రియను వైసీపీ మండల ఇన్చార్జ్ మద్దిశెట్టి రవీంద్ర, ఏఎంసీ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ప్రజలఆరోగ్యం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రెండవ డోస్ పూర్తి కాగానే మొదటి డోస్ వేయటం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా రవీంద్ర, వేణుగోపాల్రెడ్డి వ్యాక్సిన్ వేయించుకున్నారు. శనివారం కొవిషీల్ట్ 50మందికి, కొవాగ్జిన్ 23 మందికి వేసినట్టు వైద్యాధికారి బి.రత్నం తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థులు మారం వెంకటరెడ్డి, తాడికొండ శ్రీనివాసరావు, సర్పంచ్లు నాగమణి, గుంటిగంగ దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, గోపిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, యాడిక శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.