తప్పుడు రిపోర్ట్‌లు!

ABN , First Publish Date - 2021-04-23T05:41:02+05:30 IST

ఓ పక్క కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిర్ధారణ పరీక్షలు చేసుకున్న వారికి తప్పుడు రిపోర్టులు రావడం కలవరపెడుతోంది.

తప్పుడు రిపోర్ట్‌లు!

భోగాపురం, ఏప్రిల్‌ 22:  ఓ పక్క కరోనా విజృంభిస్తున్న తరుణంలో నిర్ధారణ పరీక్షలు చేసుకున్న వారికి తప్పుడు రిపోర్టులు రావడం కలవరపెడుతోంది. భోగా పురం మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రెండు వారాల కిందట స్థానిక సీహెచ్‌సీలో కొవిడ్‌ పరీక్షలు చేయించుకొన్నారు. వారిద్దరికీ ఈనెల 21న కొవిడ్‌ నెగిటివ్‌ అంటూ సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో వారిద్దరూ ఊపిరి పీల్చు కున్నారు. అయితే వారిద్దరికి సంబంధించిన రిపోర్టులు పాజిటివ్‌ అంటూ పోలిపల్లి పీహెచ్‌సీకి చేరాయి. దీంతో వారిద్దరికీ కొవిడ్‌ వైద్యం అందించేందుకు  సంబంధిత వైద్య సిబ్బంది ఫోన్‌ చేశారు. తమకు నెగిటివ్‌ వచ్చినట్లు వారికొచ్చిన మెసేజ్‌లను వైద్య సిబ్బందికి పంపించారు. దీంతో వైద్య సిబ్బంది అయోమయంలో పడ్డారు. 

రెండు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తాం

పరీక్ష చేసుకున్న ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చినట్టు మాకు సమాచారం వచ్చింది. అయితే వారిద్దరి సెల్‌ఫోన్లకు మాత్రం నెగిటివ్‌గా మెసేజ్‌ వచ్చింది. దీనిపై కొవిడ్‌ పరీక్షల నిర్వాహకలను ఆరా తీయగా రెండు రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు. వారిద్దరికీ ఎటువంటి లక్షణాలు లేవు. కానీ ముందస్తు జాగ్రత్తగా హోం క్వారంటైన్‌లోనే ఉండమని చెప్పామన్నారు.

- సునీల్‌కుమార్‌, పోలిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి

 

Updated Date - 2021-04-23T05:41:02+05:30 IST