పాపం ఈ కుటుంబం.. గుంటూరు జిల్లాలో విషాద ఘటన

ABN , First Publish Date - 2022-08-19T06:04:33+05:30 IST

ఇంటి యజమాని తెలియకుండా కుటుంబ సభ్యులు చేసిన అప్పుల భారం చివరికి వారి ప్రాణాలను బలిగొంది.

పాపం ఈ కుటుంబం.. గుంటూరు జిల్లాలో విషాద ఘటన
వసుంధర, కిరణ్‌, యామిని పాతచిత్రం

తల్లి, కుమారుడు, కోడలు ఆత్మహత్య

తెనాలి: ఇంటి యజమాని తెలియకుండా కుటుంబ సభ్యులు చేసిన అప్పుల భారం చివరికి వారి ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. కొలకలూరులో అప్పుల భారంతో ఓ కుటుంబంలోని ముగ్గురు బుధవారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తల్లి వసుంధర (55), కుమారుడు కిరణ్‌ (35), కోడలు యామిని(25) గురువారం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్ధానికుల తెలిపిన సమాచారం మేరకు.. ఇంటి యజమాని పి.శ్రీనివాసరావు ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఉదయం వెళితే రాత్రికి కానీ ఇంటికి తిరిగిరాడు. వారికి ఓ ఎకరం పొలం ఉంది. కిరణ్‌, యామినికి ఏడేళ్ల కిందట వివాహమైంది. శ్రీనివాసరావు ఇంటి వ్యవహారాలు అంతగా పట్టించుకోకపోవడంతో ఉన్న  పొలం ఆధారంగా భార్య, కుమారుడు కలసి గ్రామంలోని ఓ వడ్డీ వ్యాపారస్తురాలు వద్ద రూ.20లక్షల మేర రెండు దఫాలుగా అపులు చేశాడు. దీనికి గాను నెలకు రూ.లక్ష వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. నెల నెలా వడ్డీ భారం పెరుగుతుండటం, అసలు, వడ్డీ తీర్చే ఆర్థికస్తోమత లేకపోవడం, వడ్డీ వ్యాపారుల నుంచి బెదిరింపులు పెరగడం, అధిక మొత్తాల్లో డిమాండ్‌ చేయడం తదిత ర సమస్యలు వెంటాడుతున్నాయి.



గతంలో వీరు చేసిన అప్పులను భర్త శ్రీనివాసరావు కొంత మేర తీర్చాడు. తిరిగి కొత్తగా అయిన అప్పుల గురించి కూడా చెబితే ఏమోవుతుందో అనే ఆందోళనతో వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు తెలిపారు. మధ్యాహ్న 3గంటల సమయంలో మృతదేహాలను గుంటూరు నుంచి కొలకలూరు గ్రామానికి తరలించారు.  తనను ఒంటరి వాడిని చేసి వెళ్లారని శ్రీనివాసరావు రోదించాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఏడుకొండలు తెలిపారు.

Updated Date - 2022-08-19T06:04:33+05:30 IST