విద్యుదాఘాతంతో రైతు మృతి
ABN , First Publish Date - 2021-07-26T05:33:26+05:30 IST
తోటి రైతు పొలానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో.. దానిని పరిష్కరించుకునేందుకు కరెంటు స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెంలో ఆదివారం జరిగింది.
కామేపల్లి,జూలై25: తోటి రైతు పొలానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడంతో.. దానిని పరిష్కరించుకునేందుకు కరెంటు స్తంభం ఎక్కిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం సాతానిగూడెంలో ఆదివారం జరిగింది. సాతానిగూడెం గ్రామానికి చెందిన సూర ప్రభాకర్ (40) అనే రైతు అదే గ్రామానికి చెందిన మరో రైతు పొలానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడంతో ప్రభాకర్ స్వయంగా మరమ్మతు చేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు. అక్కడ వైర్లను సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కామేపల్లి ఎస్ఐ స్రవంతి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్కు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కామేపల్లి విద్యుత్ ఏఈ నారాయణను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. తమకు సదరు రైతులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీసం ఎల్సీ కూడా తీసుకోలేదన్నారు. విద్యుత్ మరమ్మతుల విషయంలో అవగాహనలేకుండా ప్రజలు ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని సూచించారు.