పాతమద్దిపడగలో విద్యుత్షాక్తో రైతు మృతి
ABN , First Publish Date - 2022-05-25T06:31:00+05:30 IST
కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన పల్లెబుచ్చన్న ( 60) అనే రైతు మంగళవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు.
ఖానాపూర్, మే 24 : కడెం మండలం పాతమద్దిపడగ గ్రామానికి చెందిన పల్లెబుచ్చన్న ( 60) అనే రైతు మంగళవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. బుచ్చన్నకు గ్రామశివారులో మూడెకరాల వ్యవసాయభూమి ఉంది. ఇందులో వరితో పాటు పలు రకాల కూరగాయలు సాగుచేశాడు. రోజూలాగే మంగళవారం కూడా తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కూరగాయలకు నీటిని పారించేందుకు వెళ్లాడు. అయితే బుచ్చన్న పొలంలోకి వెళ్లేసరికి విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయి. దీంతో విద్యుత్ తీగలను సరి చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాన్స్ఫార్మర్ వద్ద తెగి పడి ఉన్న విద్యుత్ తీగలకు తగిలి బుచ్చన్న అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య చంద్రవ్వ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.