పట్టాల కోసం రోడ్డెక్కిన రైతులు

ABN , First Publish Date - 2020-11-24T10:16:27+05:30 IST

పంట భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని వేపచెట్టుతండాలో గిరిజన రైతులు సోమవారం జాతీయ రహదారిపై వంటావార్పు, రాస్తారోకో నిర్వహించారు. రైతు కమిటీ, సర్పంచ్‌ భూక్య పద్మావతి వెంకన్న

పట్టాల కోసం రోడ్డెక్కిన రైతులు

వేపచెట్టుతండాలో వంటావార్పు, రాస్తారోకో


ఖానాపురం, నవంబరు 23: పంట భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ మండలంలోని వేపచెట్టుతండాలో గిరిజన రైతులు సోమవారం జాతీయ రహదారిపై వంటావార్పు, రాస్తారోకో నిర్వహించారు. రైతు కమిటీ, సర్పంచ్‌ భూక్య పద్మావతి వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో రైతులు భూక్య లక్ష్మణ్‌, మూడు కేత్య, ధరావత్‌ బిచ్చా, రైతుబంధు సమితి సభ్యుడు బానోతు భిక్షపతి, ఉపసర్పంచ్‌ మూడు దేవేందర్‌లు మాట్లాడారు. మంగళవారిపేట పాత జీపీ పరిధిలోని ఆరు గ్రామపంచాయతీలకు సంబంధించిన సర్వే నెంబరు 22బై19లోని 2200 ఎకరాల భూములకు పట్టాలు లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా, పంట రుణాలు అందడం లేదన్నారు. తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సాయిబాబు రైతులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు విజయ్‌, రవి, లాలు, హేమ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-24T10:16:27+05:30 IST