రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-11-28T05:31:30+05:30 IST

తుఫాను కారణంగా తలెత్తిన విపత్తులో పంటలు కోల్పోయిన రైతులందరికీ ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.20 వేలు పరిహారం చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలి
కొట్టుకుపోయిన మహల్‌ కాజ్‌వేను పరిశీలిస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, నవంబరు 27: తుఫాను కారణంగా తలెత్తిన విపత్తులో పంటలు కోల్పోయిన రైతులందరికీ ప్రభుత్వం ఎకరాకు కనీసం రూ.20 వేలు పరిహారం చెల్లించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రధానంగా ఎకరాకు రూ.40 వేలు వరకూ పెట్టుబడి పెట్టి వరి, వేరుశనగ పంటలు వేసిన రైతులు నిలువునా నష్టపోయారని చెప్పారు. మహల్‌ ఎర్రకోటపల్లె మార్గంలో బాహుదా నదిపై తుడిచిపెట్టుకుపోయిన కాజ్‌వేను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మహల్‌లో రైతులతో సమావేశమై పంట నష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. గతంలో విపత్తులు ఎదురైతే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తుఫానుకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరిస్తారన్న నమ్మకం లేదని పేర్కొన్నారు. మూడు దశాబ్దాల క్రితం టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా కట్టించిన ఇళ్ళకు ఓటీఎస్‌ పేరుతో డబ్బు చెల్లించాలని వైసీపీ ప్రభుత్వం వత్తిడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్టీఆర్‌, రాజశేఖర్‌ రెడ్డితో సహా అనేక మంది ముఖ్యమంత్రులు పేదలకిచ్చిన ఇళ్ళకు డబ్బు చెల్లించాలని ఇలా అడ్డదారులు తొక్కలేదని విమర్శించారు. జగన్‌ మాయమాటలు విని ఉచిత ఇళ్ళకు డబ్బులు చెల్లించ వద్దని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగానే హక్కులు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పర్యటనలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, మహ్మదాలీ, మల్‌ రెడ్డి, మున్వర్‌ ఆలీ, కోట రమణ, పెద్దన్న, రెడ్డిశేఖర్‌ రెడ్డి, మదనమోహన్‌ రెడ్డి, తిమ్మయ్య, తమీమ్‌, షబ్బీర్‌, స్వామి, సర్వర్‌, మౌలా, ఫిరోజ్‌, ఆరిఫ్‌, బాబ్జీ, మనోహర్‌, ఖాజా, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:31:30+05:30 IST