నకిలీ విత్తనాలతో రైతుల దగా
ABN , First Publish Date - 2022-06-28T06:48:58+05:30 IST
వానాకాలం సాగులో రైతులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. నకిలీ విత్తనాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. సోయా విత్తనాలు వేసి పక్షం రోజులు దాటినా విత్తనాలు మొలకెత్త లేదు. విక్రాంత్కంపెనీ తప్ప ఇతర సోయా విత్తనాలు మొలకెత్తాయి. మండలంలో నకిలీ విత్తనాల కారణంగా వందలాది
రెండోసారి విత్తనాలు వేసుకుంటున్న మండలంలోని రైతాంగం
బేల, జూన్ 27: వానాకాలం సాగులో రైతులకు ఆదిలోనే చేదు అనుభవం ఎదురైంది. నకిలీ విత్తనాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. సోయా విత్తనాలు వేసి పక్షం రోజులు దాటినా విత్తనాలు మొలకెత్త లేదు. విక్రాంత్కంపెనీ తప్ప ఇతర సోయా విత్తనాలు మొలకెత్తాయి. మండలంలో నకిలీ విత్తనాల కారణంగా వందలాది ఎకరాల్లో రైతులు తిరిగి రెండోసారి విత్తనాలు విత్తుతున్నారు. ఖరీఫ్ సమయం దాటిపోతుందేమో అనే సందేహంతో అధికారుల పర్యవేక్షణ, పరిహారం కోసం వేచి చూడకుండా రైతులు తమ సాగులో నిమగ్నమయ్యారు.
మొలకెత్తని సోయా పంటచేల పరిశీలన
తలమడుగు: నకిలీ విత్తనాలతో పంటలు మొలకెత్తక రైతులు ఆందోళన చెంది అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్పందించిన జిల్లా వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సోమవారం మండలంలోని దేవాపూర్, డోర్లి, తలమడుగు, కజ్జర్ల, ఉండం గ్రామాల్లో గల వ్యవసాయ పంట పొలాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు డా.మోహన్దాస్, డా.రాజేందర్రెడ్డి, ఏడీరమేష్, మండల వ్యవసాయాధికారి మహేందర్లు పర్యటించి మొలకెత్తని సోయాబీన్ పంటలను పరిశీలించి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు నాటిన సోయాబీన్ పంట విత్తనాల వివరాల ను, భూమికి సంబందించిన శ్యాంపుల్స్ను సేకరించి ల్యాబ్కు తరలించడం జరుగుతుందన్నారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా వివరాలను వెల్లడిస్తామన్నారు.
‘న్యాయం జరిగే వరకూ పోరాడతాం’
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ ట్రేడర్స్లో సోయాబీన్ విత్తనాలను కొనుగోలు చేసి వ్యవసాయ పంట పొలాల్లో వేసి 15 రోజులైనా మొలకెత్తక పోవడంతో రైతులు జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని బాధిత రైతులు వాపోయారు. పంటనష్టపోయిన రైతులకు సంబంధిత డీలర్ లేదా కంపెనీ నుంచి నష్ట పరిహారం వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు.