యాదాద్రి థర్మల్ రైల్వే పనులను అడ్డుకున్న రైతులు
ABN , First Publish Date - 2022-07-01T07:19:05+05:30 IST
యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమకు బొగ్గు సరఫరా కోసం నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను మండలంలోని నర్సాపురం రైతులు గురువారం అడ్డుకున్నారు.
దామరచర్ల, జూన్ 30: యాదాద్రి థర్మల్ విద్యుత్ పరిశ్రమకు బొగ్గు సరఫరా కోసం నిర్మిస్తున్న రైల్వేలైన్ పనులను మండలంలోని నర్సాపురం రైతులు గురువారం అడ్డుకున్నారు. భూములు కోల్పోతున్న తమకు నష్టపరిహారం ప్రకటించకుండానే ఏ విధంగా పనులు చేపడతారని అధికారులను నిలదీశారు. పూర్తిస్థాయి పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని నిరసన తెలిపారు. గ్రామంలోని సర్వే నెం.36, 38, 42, 43, 44లలో సుమారు 15ఎకరాల భూమిని రైల్వేలైన్ నిర్మాణం కోసం సంబంధిత అధికారులు సర్వే చేపట్టారు. రైతుల ఆందోళనతో అధికారులు పనులను నిలిపివేశారు. అక్కడికి చేరుకొన్న ఎస్ఐ రవికుమార్, ఇతర అధికారులు రైతులకు నచ్చజెప్పారు. ఆర్డీవోను కలిసి సమస్యను పరిష్కరించకోవాలని వారికి సూచించారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేణుగోపాల్, రైతులు మాలోతు వినోద్నాయక్, రఘు, మేష్యా, తదితరులు పాల్గొన్నారు.