లక్ష్మీనగర్లో వానరదండుతో రైతుల బెంబేలు
ABN , First Publish Date - 2021-03-01T05:44:02+05:30 IST
వానరులు పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లను ధ్వంసం చేస్తున్నా సర్పంచు, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని సర్పంచు, అధికారులు
కోతుల బెడద నుంచి పంటలను, ఇళ్లను కాపాడాలని గ్రామస్థుల వినతి
మిరుదొడ్డి, ఫిబ్రవరి 28: వానరులు పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లను ధ్వంసం చేస్తున్నా సర్పంచు, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్లో వందల సంఖ్యలో ఉన్న వానరులతో ఇబ్బందులు పడుతున్నామని, తమపై ఎక్కడ దాడి చేస్తాయో అని భయపడుతున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. చుట్టుప్రక్కల గ్రామాల సర్పంచులు కొండముచ్చులను తీసుకువచ్చి కొతుల బెడద లేకుండా చేస్తున్నారని, తమ గ్రామంలో వానరదండును తరిమికొట్టడానికి సర్పంచు, సంబంధిత ఫారెస్ట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ వాపోయారు. ఇప్పటికైనా సర్పంచు స్పందించి పంట పొలాలను నాశనం చేస్తున్న వానరదండు నుంచి పంటలను, ఇళ్లను కాపాడాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.