విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలకు ఫారూఖ్ అబ్దుల్లా డిమాండ్

ABN , First Publish Date - 2022-01-14T01:48:01+05:30 IST

ఈ ద్వేషపూరిత ప్రసంగ సమావేశాలు భారతీయ చట్టాల ప్రకారం నేరాలకు ఏమాత్రం తీసిపోవు. జాతీయ సమగ్రత, శాంతికి విరుద్ధమైనవి. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల ఇవి ఇంకా పెరిగిపోతున్నాయి. వీటిపై తక్షణ చర్య అవసరం..

విద్వేష ప్రసంగాలపై కఠిన చర్యలకు ఫారూఖ్ అబ్దుల్లా డిమాండ్

శ్రీనగర్: విద్వేష ప్రసంగాలు చేసే వారికి కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా వస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. విద్వేష వ్యాఖ్యల వల్ల దేశంలో సామరస్యత పాడవుతుందని, అది దేశానికి ప్రమాదకరమని ఫారూఖ్ అన్నారు.


గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ఈ ద్వేషపూరిత ప్రసంగ సమావేశాలు భారతీయ చట్టాల ప్రకారం నేరాలకు ఏమాత్రం తీసిపోవు. జాతీయ సమగ్రత, శాంతికి విరుద్ధమైనవి. ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు లేకపోవడం వల్ల ఇవి ఇంకా పెరిగిపోతున్నాయి. వీటిపై తక్షణ చర్య అవసరం, లేకుంటే అది ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారికి మరింత ధైర్యాన్ని ఇస్తుంది. ఇలాంటి వారు పెరిగితే దేశంలో వాతావరణం నాశనం అవుతుంది. అనివార్యంగా ఇది మైనారిటీలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది భారతదేశానికి ఎలాంటి ప్రయోజనమూ కలిగించదు’’ అని అన్నారు.


ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలకు వ్యతిరేకంగా కొంతమంది సాదువులు విద్వేష వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదే సభలో మహాత్మా గాంధీపై కూడా ద్వేష వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపినందుకు గాడ్సేను దేవుడు అంటూనే గాంధీపై బయటికి చెప్పలేని పదాలతో దూషించారు.

Updated Date - 2022-01-14T01:48:01+05:30 IST