
అతడు భార్య, ఆరుగురు పిల్లలు ఉండగా.. మరో యువతిని మోసం చేసి వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల తరువాత విషయం తెలిసిన రెండో భార్య అతను ఇకపై మొదటి భార్య వద్దకు వెళ్లకూడదని షరతు విధించింది. దీంతో అతని మొదటి భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ సమస్యను సినీ ఫక్కీలో పరిష్కరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
వివరాల్లోకి వెళితే.. బీహార్లోని పుర్ణియా జిల్లా భవానిపూర్ పట్టణంలో నివసించే లలితాదేవి(33, పేరు మార్చబడినది) భర్త దిలీప్(36) భార్య ఉండగా.. రత్నా దేవి అనే యువతిని మరో పెళ్లి చేసుకున్నాడు. దిలీప్, లలితా దేవికి అరుగరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం అతని రెండో భార్య రత్నా దేవికి తెలియడంతో ఆమె భర్తతో గొడవ పడింది. చివరికి అతడు ఇకపై మొదటి భార్య వద్దకు వెళ్లకూడదని షరతు విధించింది. దీంతో అతను లలితా దేవి వద్దకు వెళ్లడం మానేశాడు. ఆ తరువాత లిలితా దేవి, రత్నాదేవి మధ్య గొడవలు మొదలయ్యాయి. కానీ దిలీప్ రెండో భార్య వద్దనే ఉంటానని చెప్పడంతో లలితాదేవి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
పోలీసులు దిలీప్, అతని ఇద్దరు భార్యలని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ తరువాత సినిమా స్టైల్లో వారి సమస్యను పరిష్కరించారు. దిలీప్ ప్రతి నెలలో మొదటి 15 రోజులు మొదటి భార్య ఇంట్లో ఉండాలని, మిగతా 15 రోజులు రెండో భార్య ఇంట్లో ఉండాలని సమాధానం చెప్పారు. పోలీసులు చెప్పిన పరిష్కారానికి ఇద్దరు భార్యలు అంగీకరించారు. దీంతో పాటు పోలీసులు దిలీప్కు కఠినంగా హెచ్చరించారు. ఇద్దరు భార్యలను సమానంగా చూడాలని చెప్పారు. ఇద్దరినీ వేర్వేరు ఇల్లల్లో పెట్టి.. వారి ఖర్చులు భరించాలని చెప్పారు. ఆ తరువాత దిలీప్, ఇద్దరు భార్యల చేత పోలీసులు చెప్పిన షరతులను అంగీకరిస్తున్నట్లు ఒక బాండ్పై సంతకాలు చేయించారు.
భవానిపూర్ పోలీసులు కుటుంబ సమస్యలకు గత 17 సంవత్సరాలుగా సామరస్యంగా పరిష్కరిస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవలే వారిని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి