అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కూతురిపై తండ్రి అత్యాచారం!

ABN , First Publish Date - 2021-07-20T12:16:31+05:30 IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్నకూతురిపై కన్నేసి...

అన్నంలో నిద్ర మాత్రలు కలిపి కూతురిపై తండ్రి అత్యాచారం!

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కన్నకూతురిపై కన్నేసి కాటేశాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఏడాది క్రితం నగరానికి వలస వచ్చింది. భర్త అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా.. భార్య ఇళ్లలో పనిమనిషిగా జీవితాన్ని సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె(16), కుమారుడు(14) ఉన్నారు. సొంతూరిలో చదువును ఆపేసిన బాలిక.. ప్రస్తుతం అమ్మానాన్నల వద్దే ఉంటోంది. ఆ కామాంధ తండ్రి.. కూతురిపై కన్నేశాడు. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి తినిపించేవాడు. ఆమె మత్తులోకి జారిన తర్వాత లైంగిక దాడికి దిగేవాడు. నిద్రమత్తులో ఉండడంతో పాపం ఆ బాలిక ఈ ఘోరాన్ని తెలుసుకోలేకపోయింది.


ఇలా బయటపడింది..

అయితే.. ఓ రోజు భార్య స్వగ్రామానికి వెళ్లిన సమయంలో.. మద్యం సేవించి వచ్చిన తండ్రి.. కూతురిపై అత్యాచారం చేశాడు. తల్లికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక మిన్నకుండిపోయింది. రెండు రోజుల క్రితం బాలిక అనారోగ్యం పాలై వాంతులు చేసుకొంది. ఆమెను తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పారు. బాలికను ఇంటికి తీసుకువచ్చిన తల్లి ఏం జరిగిందని నిలదీయగా.. విలపిస్తూ తండ్రి తనపై చేసిన అఘాయిత్యం గురించి చెప్పింది. గుండె రగిలిపోయిన తల్లి.. బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-07-20T12:16:31+05:30 IST