నియంత్రణలో జ్వరాలు

ABN , First Publish Date - 2022-06-29T04:32:13+05:30 IST

డేగపూడి గ్రామంలో జ్వరాలు నియంత్రణలో ఉన్నాయని పలువురు జిల్లా అధికారులు తెలిపారు.

నియంత్రణలో జ్వరాలు
ఇళ్ల పరిసరాల్లో పరిశీలిస్తున్న డాక్టర్‌ పి.ఎల్‌.దయాకర్‌, సిబ్బంది

డేగపూడిలో అధికారుల పరిశీలన

బావినీరు బాగానే ఉన్నట్టు నివేదిక

పొదలకూరు, జూన్‌ 28 : డేగపూడి గ్రామంలో జ్వరాలు నియంత్రణలో ఉన్నాయని పలువురు జిల్లా అధికారులు తెలిపారు. విష జ్వరాలతో అల్లాడుతున్న మండలంలోని డేగపూడి గ్రామాన్ని మంగళవారం పలువురు జిలా అధికారులు పరిశీలించారు. ఈ గ్రామంలో రెండు వారాలుగా విషజ్వరాలు ప్రబలుతుండడంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్యశాఖ నెల్లూరు డివిజన్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ పి.ఎల్‌.దయాకర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రంగప్రసాద్‌, డీఈ శ్రీనివాసులురెడ్డి, డీఎల్పీవో కృష్ణమోహన్‌ వైద్య శిబిరాన్ని పరిశీలించారు.  జ్వరపీడితులను పరామర్శించారు.  వాతావరణం మార్పుతో జ్వరాలు వచ్చి తగ్గిపోతున్నాయని, పారిశుధ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని అన్నారు. నెల్లూరు లోని పలు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిసిందన్నారు. వైద్య, సచివాలయ సిబ్బంది గ్రామంలో ఫీవర్‌ సర్వే చేస్తున్నారని తెలిపారు. దొరువులో నీటిని బయటకు పంపించి పూర్తిగా మూసివేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.  ఇందుకు తగిన నిధులు వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామని తెలిపారు. జ్వరాలు పూర్తిగా తగ్గేవరకు వైద్య శిబిరం కొనసాగుతుందని చెప్పారు. బావి నీరు బాగానే ఉన్నట్టు నివేదికలు వచ్చాయని,  దీన్నిబట్టి ఆ నీటి వల్ల జ్వరాలు రాలేదని తేలిందన్నారు. గ్రామంలోని పేడ దిబ్బలను జేసీబీ, ట్రాక్టర్లతో ఊరికి దూరంగా తరలించారు. ప్రతి ఇంటిని సందర్శించి లార్వా సర్వే, ఫీవర్‌ సర్వేను పర్యవేక్షించారు. కార్యక్రమంలో మహమ్మదాపురం డాక్టర్‌ ఎం.రమేష్‌, సబ్‌ యూనిట్‌ అధికారి ఆంజనేయవర్మ, ఈఓపీఆర్‌డీ నారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, సూపర్‌వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు ఉన్నారు. 

Updated Date - 2022-06-29T04:32:13+05:30 IST