పండిట్ జనార్దన్కు సత్కారం
ABN , First Publish Date - 2022-05-23T17:10:24+05:30 IST
రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అమరగాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకల్లో భాగంగా అంతర్జాల వేదికగా నిర్వహించిన
చెన్నై, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అమరగాయకుడు ఘంటసాల శతజయంతి వేడుకల్లో భాగంగా అంతర్జాల వేదికగా నిర్వహించిన విశిష్ట కార్యక్రమంలో ప్రముఖ సితార్ విద్వాంసులు పండిట్ మిట్టా జనార్దన్కు జీవనసాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షుడు రాళ్ళపల్లి సుందరరావు అధ్యక్షత వహించి ప్రసగించారు. కార్యదర్శి పివిపిసి ప్రసాద్ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఘంటసాలతో, వారి కుటుంబ సభ్యులతో తమకున్న సాన్నిహిత్యం గురించి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ రాష్ట్రపతి వీవీ గిరి కోడలు పద్మభూషణ్ మోహినిగిరి వివరించారు. పండిట్ మిట్టా జనార్ధన్ సితార్ వాద్యం గురించి చాలాసార్లు విన్నానని, ఆ వాద్యవిన్యాసం నిరుపమానమని,ఈ వేడుకల్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు.అనంతరం చెన్నై లో సితార్ విద్వాంసులు పండిట్ మిట్టా జనార్దన్ నివాసంలో నిర్వహించిన విశేష కార్యక్రమంలో సమాఖ్య సభ్యులు ఆచార్య మాడభూషి సంపత్కుమార్, కిడాంబి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. తొలుత పండిట్ మిట్టా జనార్దన్ను కిడాంబి లక్ష్మీకాంత్ పూలమాలతో సత్కరించారు. మాడభూషి సంపత్కుమార్ మిట్టా జనార్దన్ను పరిచయం చేసి సత్కరించి, ఘంటసాల జీవన సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. లేళ్ళపల్లి శ్రీదేవి సన్మాన పత్రం చదివి వినిపించారు. చివరగా లేళ్లపల్లి రమేష్ శ్రీదేవి దంపతులు పురస్కార గ్రహీతకు సంగీత చక్రాన్ని బహూకరించారు. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య నుంచి ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం స్వీకరించడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పండిట్ జనార్దన్ తన స్పందనలో పేర్కొన్నారు. పండిట్ రవి శంకర్ వద్ద శిక్షణ పొందటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ అంతర్జాల కార్యక్రమంలో ప్రముఖులు ఎస్వీ రామారావు, కేవీ రావు తదితరులు ప్రసంగించారు.