అవమానాలపాలయ్యాను : అమరీందర్ సింగ్
ABN , First Publish Date - 2021-09-18T22:52:33+05:30 IST
పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్
చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రాజీనామా అనంతరం కెప్టెన్ సింగ్ మాట్లాడుతూ, తాను మూడుసార్లు తీవ్ర అవమానాలకు గురయ్యానని చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.
‘‘ఇలా జరగడం ఇది మూడోసారి, రెండోసారి ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిచారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశం’’ అన్నారు. తన సామర్థ్యంపై కొంచెం అనుమానం వ్యక్తమైనా అది తనకు అవమానమేనని చెప్పారు.
భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ఆయన ప్రకటించలేదు. తన నిర్ణయాన్ని తెలియజేస్తానని మాత్రమే చెప్పారు. ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తాను పార్టీలో ఉంటానని, తన సహచరులతో మాట్లాడతానని, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు నమ్మకం ఉన్నవారిని ముఖ్యమంత్రిగా నియమించుకోవచ్చునని తెలిపారు.
అంతకుముందు కెప్టెన్ ఇచ్చిన ట్వీట్లో, తాను శనివారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడానని తెలిపారు. తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపానని చెప్పారు.