ఇంటి చుట్టూ ఫెన్సింగ్‌...

ABN , First Publish Date - 2021-05-15T05:59:38+05:30 IST

పంచాయతీ పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటిచుట్టూ వైసీపీ నాయకులు ఫెన్సింగ్‌ వేసిన సంఘటన అమరావతిలో జరిగింది.

ఇంటి చుట్టూ ఫెన్సింగ్‌...
ఇంట్లోకి వెళ్లకుండా స్థలం చుట్టూ వేసిన ఐరన్‌ ఫెన్సింగ్‌

వైసీపీ నాయకుల నిర్వాకం

అమరావ తి, మే 14: పంచాయతీ పోరంబోకు స్థలంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఇంటిచుట్టూ వైసీపీ నాయకులు ఫెన్సింగ్‌ వేసిన సంఘటన అమరావతిలో జరిగింది. ఈ విషయంపై బాధితుని కథనం ప్రకారం... పది సంవత్సరాలుగా పంచాయతీ పోరంబోకు భూమిలో చిలకా వెంకయ్య నివాసం ఉంటున్నాడు. చిలకా వెంకయ్య టీడీపీ సానుభూతిపరుడవటంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత సంవత్సరం మే నెలలో స్థానిక వైసీపీ నాయకులు నివాసాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో వెంకయ్య హైకోర్టును ఆశ్రయించడంతో మండల, గ్రామస్థాయి అధికారులకు నోటీసులు వచ్చాయి. అప్పుడు వైసీపీ నాయకులు తొలగింపు పక్రియను విరమించుకుని సంవత్సరం తరువాత మరలా శుక్రవారం నూతన సర్పంచ్‌గా ఎన్నికైన చిలకా ఆనందరావు తన అనుచరులతో సాయంత్రం 4గంటలకు ఎక్స్‌వేటర్‌ తీసుకువచ్చి ఇంట్లోకి వెళ్లే మార్గాన్ని తొలగించి ఇంటి చుట్టూ వెంకయ్య కుటుంబం బయటకు రాకుండా ఫెన్సింగ్‌ వేశారు. స్థలం విషయం కోర్టులో ఉన్నప్పటికీ సర్పంచ్‌ అతని అనుచరులు ఇంట్లోకి రాకపోకలు లేకుండా ఫెన్సింగ్‌ వేయించడంపై బాధితుని కుమారుడు బుల్లోడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. అధికారులు స్పందించి ఫెన్సింగ్‌ తొలగించాలని లేకుంటే దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-15T05:59:38+05:30 IST