రైళ్లు వెలవెల.. బస్సులు కిటకిట
ABN , First Publish Date - 2022-01-18T05:33:14+05:30 IST
రైళ్లు వెలవెల.. బస్సులు కిటకిట
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పండుగ తిరుగు ప్రయాణాలపై ఒమైక్రాన్ ప్రభావం పడింది. రైళ్లలో రాకపోకలకు ప్రయాణికులు భయపడిపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఆరు రోజుల్లో 46 రైళ్లను విజయవాడ డివిజన్ అధికారులు రద్దు చేశారు. కనీస అడ్వాన్స్, కరెంట్ బుకింగ్ లేకపోవ టమే ఇందుకు కారణం. రద్దు చేసిన రైళ్లలో బెంగళూరు-చెన్నై (రైలు నెంబర్ 17237) నాలుగు సర్వీసులు, చెన్నై-బెంగళూరు (రైలు నెంబర్ 17238) నాలుగు సర్వీసులు, నర్సాపూర్-నిడదవోలు (రైలు నెంబర్ 07897) ఐదు సర్వీసులు, మచిలీపట్నం-గుడివాడ (రైలు నెంబర్ 07869) నాలుగు సర్వీసులు, గుడివాడ-మచిలీపట్నం (రైలు నెంబర్ 07800) నాలుగు సర్వీసులు, నిడదవోలు-నర్సాపూర్ (రైలు నెంబర్ 07771) ఐదు సర్వీసులు, నర్సాపూర్-విజయవాడ (రైలు నెంబర్ 17270), ఐదు సర్వీసులు, విజయవాడ-నర్సాపూర్ (రైలు నెంబర్ 17269) ఐదు సర్వీసులు, మచిలీపట్నం-గుడివాడ (రైలు నెంబర్ 07245) ఐదు సర్వీసులు, గుడివాడ-మచిలీపట్నం (రైలు నెంబర్ 07897) ఐదు సర్వీసుల చొప్పున 46 సర్వీసులను రద్దు చేస్తున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్ ప్రకటించింది.
ఆర్టీసీలో ప్రత్యేక బస్సులు
హైదరాబాద్కు వెళ్లే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. సోమవారం హైదరాబాద్ రూట్ లోని షెడ్యూల్ బస్సుల్లో సీట్లన్నీ నూరుశాతం నిండిపోయాయి. ఇవికాకుండా సాయంత్రం నాటికి 32 స్పెషల్స్ నడిపారు. అయినా సరిపోకపోవడంతో మరో 28 స్పెషల్స్ నడిపారు. ఒక్క హైదరాబాద్ రూట్లోనే 365 రెగ్యులర్ బస్సులతో పాటు 60 స్పెషల్స్ నడిచాయి. ఉత్తరాంధ్ర, రాజమండ్రి, రాయలసీమ సెక్టార్కు పెద్దగా స్పెషల్స్ ఏమీ నడపలేదు.