మీ ఆరోగ్యం ఎలా ఉంది?
ABN , First Publish Date - 2022-01-22T04:39:22+05:30 IST
వేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించడానికి ప్రతీ గ్రామంలో ఫీవర్సర్వే ప్రారంభించింది. మెదక్ జిల్లాలో 1.72 లక్షల కుటుంబాలుండగా 633 బృందాలతో ఇంటింటా సర్వే చేస్తున్నారు. మొదటి రోజు 37,711 కుటుంబాలను సర్వే చేయగా 2,443 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారందరికీ ఐసోలేషన్ కిట్లను అందజేశారు.
గ్రామాల్లో ముమ్మరంగా ఫీవర్సర్వే
మెదక్ జిల్లాలో 633 బృందాలతో 37,711 కుటుంబాల సర్వే
2,443 మంది అనుమానితులకు ఐసోలేషన్ కిట్ల పంపిణీ
సిద్దిపేట జిల్లాలో 632 మందికి కొవిడ్ లక్షణాలు
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట/సంగారెడ్డి అర్బన్/మెదక్ అర్బన్, జనవరి 21: వేగంగా వ్యాప్తిచెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్యఆరోగ్యశాఖ యంత్రాంగం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారిని గుర్తించడానికి ప్రతీ గ్రామంలో ఫీవర్సర్వే ప్రారంభించింది. మెదక్ జిల్లాలో 1.72 లక్షల కుటుంబాలుండగా 633 బృందాలతో ఇంటింటా సర్వే చేస్తున్నారు. మొదటి రోజు 37,711 కుటుంబాలను సర్వే చేయగా 2,443 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారందరికీ ఐసోలేషన్ కిట్లను అందజేశారు.
సంగారెడ్డి జిల్లాలో 1,278 బృందాలు
సంగారెడ్డి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచే ఫీవర్ సర్వే ప్రారంభమైంది. ఇందుకోసం జిల్లాలో 1,278 బృందాలు ఏర్పాటు చేశారు. ప్రతీ బృందం రోజుకు 25 ఇళ్ల చొప్పున సర్వే నిర్వహించాలని నిర్దేశించారు. ఫీవర్ సర్వేతో పాటు టీకా తీసుకోని అర్హులను కూడా గుర్తిస్తున్నారు. టీనేజర్లు, వృద్ధులకు ప్రికాషన్ డోసు ఇప్పిస్తున్నారు. సర్వేలో ఎంపీడీవోలు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలో 32,178 ఇళ్లలో సర్వే
జ్వర సర్వేలో భాగంగా సిద్దిపేట జిల్లాలో శుక్రవారం 32,178 ఇళ్లను ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, ఐకేపీ సిబ్బందితో కూడి బృందాలు సందర్శించాయి. తొలిరోజు 632 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి ఐసోలేషన్ కిట్లను అందజేశారు. జిల్లాలో మరో నాలుగు రోజుల పాటు సర్వే జరగనున్నది.