రాహుల్పై కల్పిత వీడియో
ABN , First Publish Date - 2022-07-03T08:58:30+05:30 IST
రాహుల్గాంధీ కేరళలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన వీడియోను కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ సహా బీజేపీ నేతలు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
బీజేపీ క్షమాపణ చెప్పకుంటే లీగల్ చర్యలు: కాంగ్రెస్
న్యూఢిల్లీ, జూలై 2: రాహుల్గాంధీ కేరళలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించిన వీడియోను కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ సహా బీజేపీ నేతలు సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ క్షమాపణ చెప్పకుంటే ఆ పార్టీపై లీగల్ చర్యలు చేపడతామని హెచ్చరించింది. ‘మీడియాలో వచ్చిన వీడియో’ అంటూ రాథోడ్ ట్విటర్లో ఉంచడం సిగ్గుచేటని మండిపడింది. బీజేపీ, ఆర్ఎ్సఎ్సలకు అబద్ధాలు, దుష్ప్రచారమే పునాది అని రాహుల్ గాంధీ విమర్శించారు. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్ విభాగం ఇన్చార్జి జైరామ్ రమేశ్ లేఖ రాశారు.
శుక్రవారం ఓ టీవీ చానల్ ప్రసారం చేసిన ‘కొంటె కథనాన్ని’ అనేకమంది బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా, అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటం దిగ్ర్భాంతి కలిగించిందని ఆ లేఖలో జైరామ్ రమేశ్ తెలిపారు. ‘వయనాడ్లో కాంగ్రెస్ కార్యాలయంపై ఎస్ఎ్ఫ ఐ దాడి గురించి రాహుల్ మాట్లాడితే, ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్యాలాల్ దారుణ హత్య గురించి మాట్లాడినట్టు మార్చేశారు’ అన్నారు. ‘మా పార్టీ నేతలు హెచ్చరించడంతో కొందరు ఆ వీడియోను తొలగించారు. రాథోడ్ కూడా తొలుత తొలగించినా, మళ్లీ దాన్నే అప్లోడ్ చేసి, వైరల్ చేస్తున్నా రు. ఇది రాహుల్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు బీజేపీ పన్నిన వ్యూహంగా అర్థమవుతోంది. ఈ రోజే దీనిపై క్షమాపణ చెప్పకుంటే మీ పార్టీపైనా, ఆ నేతలపైనా లీగల్ చర్యలు చేపడతాం’ అని జైరామ్ రమేశ్ తెలిపారు. ఆ వీడియోను వైరల్ చేసిన బీజేపీ నేతలు కోర్టుల చుట్టూ తిరిగేందుకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యక్షుడు పవన్ ఖేరా హెచ్చరించారు.