హిందుత్వంపైనే పోరు నడుస్తోంది: ఓవైసీ విమర్శలు

ABN , First Publish Date - 2022-01-30T16:22:49+05:30 IST

ఇక్కడ సామాజిక న్యాయం, అభివృద్ధి గురించి ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అఖిలేష్, యోగిలు హిందుత్వంపైనే ఎన్నికల పోరు చేస్తున్నారు. మోదీ కంటే తామే గొప్ప హిందువులమని..

హిందుత్వంపైనే పోరు నడుస్తోంది: ఓవైసీ విమర్శలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి, సమాజాకి న్యాయం లాంటి అంశాలపై కాకుండా హిందుత్వంపై మతంపై ఈ రెండు పార్టీల ఎన్నికల ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ గొప్ప హిందుత్వం పోటీ పెట్టుకున్నారని, మోదీ కంటే గొప్ప హిందువు తానేనని నిరూపించుకునే పనిలో ఇద్దరూ మునిగిపోయారని ఓవైసీ దుయ్యబట్టారు.


‘‘ఇక్కడ సామాజిక న్యాయం, అభివృద్ధి గురించి ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అఖిలేష్, యోగిలు హిందుత్వంపైనే ఎన్నికల పోరు చేస్తున్నారు. మోదీ కంటే తామే గొప్ప హిందువులమని నిరూపించుకునే పనిలో ఉన్నారు. ఒకరు ఒక మందిరం గురించి మాట్లాడితే మరొకరు మరొక మందిరం గురించి మాట్లాడతారు’’ అని ఓవైసీ అన్నారు.


ఇక పోతే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం 100 స్థానాల్లో పోటీకి దిగనున్నట్లు ఓవైసీ ప్రకటించారు. ‘భాగస్వామ్య సంకల్ప కూటమి’ పేరుతో కొన్ని పార్టీలతో కలిసి ఏఐఎంఐఎం పోటీ చేస్తోంది. తమ కూటమి నుంచి ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ఎంచుకున్నామని, ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బాబు సింగ్ కుశ్వాహా మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, మరో రెండున్నరేళ్లు దళిత ముఖ్యమంత్రి ఉంటారని ఓవైసీ అన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రులు ముగ్గురు ఉంటారని, ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారు కాగా మరో ఇద్దరు ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉంటారని ఓవైసీ తెలిపారు.

Updated Date - 2022-01-30T16:22:49+05:30 IST